ప్రపంచంలోని బలహీనవర్గాలకు జీ20 దేశాలు బాసటగా నిలవాలని, పేరుకుపోతున్న అప్పులను తగ్గించడంపై ఫోకస్ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సంస్థలు పరిస్థితులకు తగ్గట్టు తమను తాము మార్చుకోకపోవడం వల్ల వాటిపై నమ్మకం కాస్త తగ్గిందని హెచ్చరించారు.
రెండు రోజుల పాటు బెంగుళూరులో జరుగుతున్న జీ20 ఆర్ధిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్స్ గవర్నర్ ల సమావేశాన్ని (ఎఫ్ఎంసీబీజీ) ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ ప్రపంచంలో కొన్ని చోట్ల యుద్ధాలు జరగడంపై విచారం ప్రకటించారు. అయితే రష్యా–ఉక్రెయిన్ దేశాల పేర్లను ప్రస్తావించలేదు.
విచ్చలవిడిగా అప్పులు చేసుకుంటూ పోవడం వల్ల చాలా దేశాలు ఆర్థికంగా దెబ్బతింటున్నాయని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాతో పాటు అప్పుల కారణంగా భారత్ చాలా ఇబ్బందుల పాలైందని, శ్రీలంక, పాకిస్తాన్ దివాలా తీశాయని చెప్పారు. సాయం కోసం ఐఎంఎఫ్ వంటి సంస్థలను ప్రాధేయపడుతున్నాయని పేర్కొన్నారు.
‘‘ఇలాంటి సంస్థలపై నమ్మకం కొద్దిగా పోయింది. ఇవి కాలానుగుణంగా మారడం లేదు. బలహీనుల సంక్షేమం గురించి చర్చ జరగాలి. యుద్ధాల వల్ల సప్లై చెయిన్లు దెబ్బతిని ధరలు పెరుగుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలపై ఇప్పటికీ కరోనా ప్రభావం ఉంది” అని తెలిపారు.
అయితే, భారత దేశంలో పరిస్థితులు బాగానే ఉన్నాయని చెబుతూ భవిష్యత్ ఇంకా బాగుంటుందన్న అంచనాలు ఉన్నాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో డిజిటల్ చెల్లింపులు విపరీతంగా పెరిగాయని గుర్తు చేశారు. కొన్నేళ్లలోనే అత్యంత నమ్మకమైన సమర్థవంతమైన డిజిటల్ ఇన్ఫ్రాను నిర్మించగలిగామని ఆయన చెప్పారు.
ఒకరికొకరు సాయం చేసుకుంటేనే జీ20 దేశాల ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. 21 వ శతాబ్దంలో ఎదురవుతున్న సమస్యలను ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకువంటి అంతర్జాతీయ సంస్థలు ఎలా పరిష్కరించాలనే విషయమై జీ20 దేశాలు తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆమె కోరారు.
పేదరిక నిర్మూలన, సస్టెయినబుల్ డెవెలప్మెంట్ గోల్స్(ఎస్డీజీలు), క్లైమేట్ ఫైనాన్స్పై ఫోకస్ చేయాలని ఆమె కోరారు. పోయిన సంవత్సరం డిసెంబర్లో, ప్రపంచ బ్యాంకు ప్రెసిడెంట్ డేవిడ్ మాల్పాస్ మాట్లాడుతూ, ప్రపంచంలోని అత్యంత పేద దేశాలు యాన్యువల్ డెట్ సర్వీస్లో 62 బిలియన్ డాలర్లు బకాయిపడ్డాయని వెల్లడించారని ఆమె గుర్తు చేశారు.
ఇది 2021లో 46 బిలియన్ డాలర్ల కంటే తక్కువగానే ఉందని, చాలా దేశాలు డిఫాల్ట్ల ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని ఆమె చెప్పారు. తక్కువ- ఆదాయ దేశాలకు అప్పుల బాధ ఎక్కువగా ఉందని, మధ్య- ఆదాయ దేశాలనూ ఈ సమస్య పీడిస్తోందని ఆమె వివరించారు.
ఈసారి జీ20 ప్రెసిడెన్సీని దక్కించుకున్న ఇండియా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కరోనా కారణంగా… అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించగల మార్గాల కోసం చర్చిస్తోంది. గ్లోబల్ ఎకానమీ పరిస్థితి ఇటీవల కాస్త బాగుపడ్డప్పటికీ, ఇంకా సమస్యలు ఉన్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. జీ20 దేశాల ఆర్థిక వ్యవస్థలకు ఎదురవుతున్న ఇబ్బందులను సమష్టిగా పరిష్కరించుకుందామని చెప్పారు.
‘‘గ్లోబల్ ఎకానమీ పూర్తిగా రెసిషన్లోకి వెళ్లిపోతుందన్న భయాలు తొలగిపోయాయి. వృద్ధి నెమ్మదించడం, కొద్దిపాటి రెసిషన్ ఇప్పుడున్న సమస్యలు. మనముందు కొన్ని సవాళ్లు ఉన్నాయి. మనందరం కలిసి ఈ సమస్యలను ఎదుర్కోవాలి. గ్లోబల్ వాల్యూ చెయిన్లకు ఇబ్బందులు లేకుండా చేయాలి. అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కేలా చర్యలు ఉండాలి”అని శక్తికాంత దాస్ చెప్పారు.