పారిశుద్ధ్య కార్మిక వ్యవస్థకు, మరణాలకు ముగింపు పలకడానికి గత పదేళ్లలో ఏం చేశారని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ ప్రశ్కు ఆరు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది.
ఈ వ్యవస్థకు ముగింపు పలకాలని, అత్యవసర పరిస్థితుల్లో కూడా తగిన భద్రత లేకుండా మురుగు కాల్వల్లోకి ప్రవేశించే ఈ ‘అమానవీయ పద్ధతి’ నుంచి భవిష్యత్ తరాలను నిరోధించాలని పదేళ్ల క్రితమే ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
డ్రై లెట్రిన్స్ (నిషేధం) చట్టం 1993, మాన్యువల్ స్కావెంజర్లుగా ఉపాధిని నిషేధించడం, వారి పునరావాస చట్టం 2013 ఉన్నా దేశంలో పారిశృధ్య కార్మికులుగా పనిచేయడం, మురుగు కాల్వల్లో చిక్కుకున్న వ్యక్తుల మరణాలు ఇప్పటికీ కొనసాగుతుండటంపై జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ నేతృత్వంలోని ధర్మాసనం ఇటీవల జ్యుడీషియల్ నోటీసు తీసుకుంది.
2014లో సఫాయి కరంచారి ఆందోళన్, ఇతరులు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో ఇచ్చిన తీర్పులో మాన్యువల్ స్కావెంజింగ్, మరణాలకు ముగింపు పలకాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మాన్యువల్ స్కావెంజర్లుగా పనిచేస్తున్న వ్యక్తులకు ఒకేసారి నగదు సహాయం చేయాలని, వారి కుటుంబాల్లో కనీసం ఒక సభ్యునికి జీవనోపాధి నైపుణ్యాల్లో శిక్షణ, రాయితీ రుణాలను అందించాలని కూడా పేర్కొంది.
మురుగునీటి పారుదల పనుల్లో 1993 నుంచి మరణించిన వారిని గుర్తించి వారి కుటుంబాలకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ప్రతి మరణానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2014లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అమలు కావడం లేదని డాక్టర్ బలరామ్ సింగ్ పిటీషన్ దాఖలు చేశారు.
ఈ పిటీషన్ను విచారిస్తున్న జస్టిస్ భట్ నేతృత్వంలోని ధర్మాసనం 2014 తీర్పును అనుసరించి కేంద్రం తీసుకును చర్యల వివరాలను కోరింది. రాష్ట్రాల వారీగా డ్రై లెట్రిన్ల కూల్చివేతలు, కంటోన్మెంట్ బోర్డులు, రైల్వేల్లో సఫాయి కరంచారుల ఉపాధి వంటి ఇతర వివరాలను కూడా కోరింది.
ఈ కేసులో కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, ఎస్సి, ఎస్టిల జాతీయ కమిషన్లను ప్రతివాదులుగా కోర్టు చేర్చింది. న్యాయవాది కె.పరమేశ్వర్ను అమికస్ క్యూరీగా నియమించింది. కోర్టు ఆదేశం ప్రకారం కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆరు వారాల్లోగా తన నివేదికను సమర్పించాల్సి ఉంది.