రాజకీయవేత్తగా మారిన సినీనటి ఖుష్భూ సుందర్కు జాతీయస్థాయిలో కీలక పదవి లభించింది. బిజెపి నేత ఖుష్భూ జాతీయ మహిళా కమిషన్ (ఎన్సిడబ్లూ) సభ్యురాలిగా నియమితులయ్యారు. ఖుష్భూ ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యవర్గ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు.
జాతీయ మహిళా హక్కుల కమిషన్ సభ్యురాలిగా నియమితులైనట్లు ఖుష్భూ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఆమెకు అభినందనలు తెలిపారు. మహిళా హక్కుల కోసం ఖుష్భూ అలుపెరగని పోరాటానికి గుర్తింపుగా పదవి లభించినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఖుష్భూ ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. “మీ నాయకత్వంలో నారీశక్తి పరిరక్షణకు, అభివృద్ధికి తీవ్రంగా కృషి చేస్తాను” అని ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా తొలుత డిఎంకెలో చేరిన ఖుష్భూ చేరారు. తర్వాత కాంగ్రెస్ లో చేరి జాతీయ అధికార ప్రతినిధిగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధిగా ఖుష్భూ ఉన్నారు. బిజెపిలో చేరిన తర్వాత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీచేసిన ఖుష్భూ డిఎంకె అభ్యర్థి ఎన్ ఎంజిలన్ చేతిలో ఓటమిపాలయ్యారు. మహిళా కమిషన్ సభ్యులుగా నామినేట్ అయినవారిలో ఖుష్భూతో పాటు మమత కుమారి, డెలియానా కొంగుప్ ఉన్నారు.