టీడీపీ నేత , మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు జారీచేశారు. అమరావతి భూముల వ్యవహారంలో నారాయణకు సిఆర్పిసి 41ఏ కింద అధికారులు నోటీసులిచ్చారు. మార్చి 6న విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు.
నారాయణతో పాటు ఉద్యోగి ప్రమీల, రామకృష్ణ హౌసింగ్ ఎండీ అంజనీకుమార్, నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్లు పునీత్, వరుణ్కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. నారాయణ కుమార్తెలు మార్చి 7న విచారణకు నోటీసులో అధికారులు పేర్కొన్నారు.
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం సందర్భంగా తయారు చేసిన అలైన్ మెంట్లో మార్పులు చేసి లబ్ది పొందారన్న ఆరోపణల్ని మాజీ మంత్రి నారాయణ ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఆయనపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా కోర్టు అనుమతితో విచారణకు రావాలని సీఐడీ నోటీసులు జారీ చేసింది.
ఆ కేసుకు తోడు నారాయణపై పదో తరగతి పరీక్షాపత్రం లీకేజీ కేసు కూడా ఉంది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నారాయణ దాఖలు చేసిన పిటిషన్పై సోమవారం సుప్రీం విచారించింది. ఈ కేసుకు సంబంధించి సెషన్స్ కోర్టులో విచారణ చేపట్టాలని ధర్మాసనం ఆదేశించింది.
మెరిట్ ఆధారంగానే విచారణ కొనసాగించాలని సుప్రీం స్పష్టం చేసింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై వారం రోజుల్లో హైకోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కల్పిస్తున్నామని, అప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
గతేడాది చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారంలో అరెస్ట్ అయిన నారాయణకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేయగా… దాన్ని సవాల్ చేస్తూ పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు నారాయణకు బెయిల్ రద్దు చేస్తూ రిమాండ్కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే దీనిపై నారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం నారాయణ బెయిల్పై బయట ఉన్నారు. ఇలా రెండు కేసులతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.