అవినీతి ఆరోపణలతో అరెస్టయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మంత్రి సత్యేందర్ జైన్ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వారి రాజీనామాలను ఆమోదించారు.
‘నాపై వారు చేసిన ఆరోపణలన్నీ నిజం కాదని కాలం వెల్లడిస్తుంది. నకిలీవనీ నిరూపితమవుతాయి. కానీ ప్రస్తుతానికి వారు అన్ని హద్దులు దాటారు. తప్పుడు, ఆధారాలు లేని ఆరోపణలతో ఒక కుట్రతో నన్ను జైల్లో పెట్టారు. మంత్రిగా నేను కొనసాగకూడదని కోరుకుంటున్నాను’ అని రాజీనామా లేఖలో సిసోడియా తెలిపారు.
రద్దయిన ఢిల్లీ మద్యం పాలసీ 2021-22 కేసులో ఆదివారం సిసోడియాను సిబిఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మనీలాండరింగ్ కేసులో సత్యేందర్ జైన్ను గత ఏడాది మేలో ఇడి అరెస్టు చేసింది. జైన్ ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. అలాగే, మంగళవారం తనను అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ మనీష్ సిసోడియా దాఖలు చేసిన పిటీషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
సిసోడియాకు ఫలితాన్ని ఇచ్చే ప్రత్యామ్నాయ విధానాలు అందుబాటులో ఉన్నాయని, ముందుగా వాటిని ఉపయోగించుకోవాలని ప్రధానన్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ సమయంలో సిసోడియా పిటీషన్ను స్వీకరిస్తే తప్పుడు సంప్రదాయానికి నాంది పలకుతున్నట్లువుతుందని తెలిపింది. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాలని సిసోడియాకు సూచించింది.