హిన్డెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ వ్యవహారంపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు విశ్రాంత న్యాయమూర్తి అభయ్ మనోహ్ సప్రే నేతృత్వంలో ఓ ఆరుగురు సభ్యుల ప్యానెల్ను ఏర్పాటు చేసింది.
అదానీ గ్రూప్లో అవకతవకలు జరిగాయంటూ జనవరి 24న ఓ నివేదిక బయటపెట్టింది హిండెన్బర్గ్ సంస్థ. అప్పటి నుంచి అదానీ గ్రూప్పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లకు రక్షణ కలిగించే విధంగా ప్రస్తుత విధానాల్లో మార్పులు తీసుకురావాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
తాజాగా వీటిపై విచారణ చేపట్టింది సీజేఈ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం. ఈ క్రమంలోనే ప్యానెల్ ఏర్పాటుకు ఆదేశాలిచ్చింది. ప్రముఖ బ్యాంకర్లు కేవీ కామథ్, ఓపీ భట్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, రిటైర్డ్ జస్టిస్ జేపీ దేవ్దార్లు ఈ ప్యానెల్లో సభ్యులుగా ఉండనున్నట్టు పేర్కొంది.
ఈ ఆరుగురు సభ్యుల ప్యానెల్.. అదానీ కేసుపై దర్యాప్తు చేపడుతుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. పెట్టుబడిదారులకు రక్షణ కల్పించడం, వ్యవస్థలోని లోపాలను సరిచేయడం వంటి అంశాలపై ప్యానెల్ కీలక సూచనలు చేస్తుందని పేర్కొంది.
మరోవైపు.. అదానీ వ్యవహారంపై చేపట్టిన దర్యాప్తును 2 నెలల్లోగా పూర్తి చేసి, స్టేటస్ రిపోర్టును సమర్పించాలని మార్కెట్ రెగ్యులేటరీ సెబీకి ఆదేశాలిచ్చింది అత్యున్నత న్యాయస్థానం. స్టాక్ మేన్యుపులేషన్ జరిగిందా? నిబంధనల ఉల్లంఘన జరిగిందా? వంటి అంశాలను సైతం విచారించి, నివేదికను సమర్పించాలని స్పష్టం చేసింది.
కమిటీ ఏర్పాటుపై కోర్టు తీర్పు ఇచ్చిన కొద్దిసేపటికే అదానీ ఒక ట్వీట్ చేశారు. గౌరవ సుప్రీం కోర్టు ఉత్తర్వులను అదానీ గ్రూప్ స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు అదానీ. ఇదే విధంగా ఒక నిర్దిష్ట వ్యవధిలో (టైం బౌండ్ మ్యానర్) ఈ వ్యవహారం ఒక కొలిక్కివచ్చేలా చేస్తుంది. చివరికి సత్యమే గెలుస్తుంది.” అని ట్వీటారు అదానీ.