ఎపికి రూ. 13 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని, వాటి ద్వారా 6 లక్షల మందికి పైగా ఉపాధి లభించనుందని ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. ఎపి ప్రభుత్వం విశాఖపట్నంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సమీట్ ను ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా 92 ఎంవో యులు కుదుర్చు కుంటున్నామని, అలాగే 340 పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. తొలి రోజునే 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారని చెబుతూ రూ. 8.54 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంవోయులు మొదటి ఈరోజు జరుగుతాయని తెలిపారు. మిగిలిన కొన్ని ఎంవోయులు శనివారం జరుగుతాయని చెప్పారు.
విశాఖ చిన్న ఏకానిమిక్ హబ్ గా మారి దేశంలోనే అతి కీలకమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎగు మతులు పెరిగాయని విశ్వాసం వ్యక్తం చేశారు. జాతీయ, అంతర్జాతీయ సదుపాయాలకు భిన్నంగా రాష్ట్రం ఉందని చెబుతూ ముఖ్య మైన జి 20 సదస్సుకు విశాఖ వేదిక గా నిలిచిందని పేర్కొన్నారు.
పరిపాలన రాజధాని గా విశాఖ మారనుందని చెబుతూ త్వరలో ఇక్కడ నుండే పాలన మొదలు కానుందని వెల్లడించారు. “నేను ఇక ఇక్కడ నుంచే పరిపాలన కొనసాగిస్థా” అని వెల్లడించారు. రాష్ట్రం అందించే అవకాశాలు, ఆరోగ్యకరమైన పోటీ, దీర్ఘకాలిక భాగస్వామ్యానికి దాని ప్రాధాన్యతను అన్వేషించాలని సూచించారు.
దేశీయంగా అంతర్జాతీయ ఆమోదాల కోసం వన్ స్టాప్ డిజిటల్ ప్లాట్ఫారమ్ ప్రవేశపెట్టామని చెబుతూ దీని ద్వారా కేవలం 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇస్తామని పారిశ్రామికవేత్తలకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు.
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం కాగా, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులలలో రాష్ట్రానికి అగ్రగామిగా ఉందని జగన్ తెలిపారు. సుదీర్ఘ తీరప్రాంతంతో సమృద్ధిగా సహజ వనరులను కలిగి ఉందని పేర్కొంటూ ఏపీలో అభివృద్ధి చెందిన ఓడరేవులు, 6 విమానాశ్రయాలు, 3 పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయని గుర్తు చేశారు.
అన్నింటికి మించి నైపుణ్యం కలిగిన యువత ఎక్కువ మంది ఇక్కడే ఉన్నారని, ఎపి 11% కంటే ఎక్కువ జిడిపి నమోదైందని చెప్పారు..ఎగుమతులు పెరిగాయని అంటూ ఎస్ డి జి లక్ష్యాలలో నీతి అయోగ్ భారతదేశంలో మూడవ స్థానంలో నిలిచిందని వివరించారు.
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా ముఖ్యమైందని కేంద్ర రోడ్డు రవాణా , రహదారుల శాఖ మంత్రి నితిన్ జైరాం గడ్కరీ తెలిపారు. ఎపి అభివృద్దికి కేంద్రం తన సంపూర్ణ సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఎపిలో తీరప్రాంతం ఎక్కువుగా అందుబాటలో ఉండటంతో లాజిస్టిక్ కు హబ్ లు ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎపిలో వివిధ రంగాలలో రూ.40 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనుందని ఆ సంస్థ ఛైర్మన్,మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ ప్రకటించారు. “మేము రూ. 40,000 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టడం ద్వారా ఏపీలో అతిపెద్ద , ఉత్తమమైన డిజిటల్ నెట్వర్క్ సృష్టిస్తున్నాము. మా 4జి నెట్వర్క్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో నివసించే వారితో సహా 98 శాతం ఎపి జనాభాను కవర్ చేస్తుంది” అని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్తో సహా భారతదేశం అంతటా జియో యొక్క ‘ట్రూ 5జి’ 2023 చివరిలోపు పూర్తవుతుందని చెబుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 10 గిగావాట్ల రెన్యూబుల్ సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించారు.