ఇండో-పసిఫిక్లో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని, మధ్యధరా సముద్రంలో ఇటలీ కీలక వాటాదారని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్లో జరిగే సంఘటనలు యూరప్పై ప్రత్యక్ష పరిణామాలను కలిగిస్తాయని ఆమె స్పష్టం చేశారు.
గురువారం న్యూఢిల్లీలో నిర్వహించిన బహుపాక్షిక సమావేశాలు ‘రైసినా డైలాగ్’ లో ఆమె ముఖ్యఅతిధిగా పాల్గొంటూ జి20లో భారత్ నాయకత్వం, రైసినా చర్చలు కలిసి ప్రపంచానికి సహకారం, శాంతి సందేశాన్ని పంపగలవని చెప్పారు. వాతావరణ మార్పులపై ప్రపంచ సమన్వయం జీరో-సమ్ గేమ్ కాకూడదని, ఈ విషయంలో భారత్ నేతృత్వంలోని ఇండో-పసిఫిక్ దేశాలు బలమైన పాత్ర పోషించాలని ఆమె సూచించారు.
ఇటలీ, భారత్లు గతం కన్నా మెరుగైన సంబంధాలను కలిగి ఉన్నాయని మెలోనీ చెబుతూ ఇరు దేశాల భౌగోళిక స్వరూపాలు ఒకేవిధంగా ఉన్నాయని తెలిపారు. తూర్పు మధ్యధరా, ఆఫ్రికా, యూరప్లను కలిపే వారధిగా ఇటలీ వ్యవహరిస్తోందని ఆమె పెక్రోన్నారు. ఉత్పత్తి దేశాలు తమ వనరుల ద్వారా పూర్తి ప్రయోజనం పొందాలని ఆమె స్పష్టం చేశారు.
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మొదట్లో ఇంధనం వంటి సాధారణ ప్రాధాన్యతలపై సమాన భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యత నిచ్చానని పేర్కొంటూ అయితే ఉత్పత్తి దేశాలు స్థిరత్వం కోసం, శ్రేయస్సు కోసం ఆయా దేశాల వనరుల నుండి తప్పక ప్రయోజనం పొందితీరాలని ఆమె స్పష్టం చేశారు. విద్యుత్తు, గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్లను తమ దేశ ప్రజల కోసం, ఐరోపా కోసం మరింత ఎక్కువగా ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.