అన్ని రంగాల్లో భారత్ పురోగతి సాధిస్తున్నదని, సృజనాత్మక రంగంలో పెట్టుబడులతో అద్భుత ఫలితాలు సాధించామనడానికి భారత్ నిదర్శనం అని మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ కొనియాడారు. భారత్ పర్యటనలో ఉన్న బిల్ గేట్స్ శనివారం ప్రధాని మోడితోభేటీ అయ్యారు. ఆరోగ్య రంగం, పర్యావరణ మార్పులు వంటి కీలక అంశాలపై ఇరువురూ చర్చించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ప్రధానితో భేటీ వివరాల గురించి గేట్స్ తన అధికారిక బ్లాగ్లో రాశారు. భారత్ అన్ని రంగాల్లో రాణిస్తోందని పేర్కొన్నారు. భారత్ ఎంతో సమర్థమైన, భద్రమైన, అందుబాటు ధరల్లో ఉండే అనేక వ్యాక్సిన్లను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసిందన్నారు. భారత్ తన ఆవిష్కరణలను ప్రపంచంతో పంచుకోవాలని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
ప్రపంచ దేశాలన్నీ పలు సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటే, భారత్ వంటి సృజనాత్మక, శక్తిమంతమైన దేశాన్ని సందర్శించడం స్ఫూర్తి కలిగిస్తున్నదని తన బ్లాగ్ ‘గేట్స్ నోట్స్’లో బిల్ గేట్స్ రాసుకున్నారు. కరోనా వేళ లక్షల మంది ప్రాణాలను కాపాడేందుకు తక్కువ ధరకే ఎంతో సమర్థవంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్లను భారీగా ఉత్పత్తి చేసిందని గుర్తు చేశారు.
భారత్లో ఉత్పత్తి చేసిన కరోనా వ్యాక్సిన్లను ఇతర దేశాలకు పంపిణీ చేసి స్నేహ బంధం ప్రదర్శించిందని బిల్గేట్స్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో భేటీ తర్వాత.. హెల్త్, అభివృద్ధి, పర్యావరణ రంగాల్లో భారత్ పురోగతిపై మరింత ఆశావాహ దృక్పథంతో ఉన్నానని ప్రశంసించారు.
భారత్లో డిజిటల్ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్నదని బిల్ గేట్స్ పేర్కొన్నారు. టెక్నాలజీ వల్ల ప్రభుత్వ పనితీరు మెరుగవుతుందనడానికి గతి శక్తి సరైన ఉదాహరణ అని చెప్పారు. సృజనాత్మక రంగంలో పెట్టుబడులతో అద్భుత ఫలితాలు సాధించగలం అని భారత్ నిరూపిస్తున్నదని చెప్పారు.
ఈ పురోగతి ఇలాగే కొనసాగుతూ ప్రపంచ దేశాలతో భారత్ తన ఆవిష్కరణలను పంచుకోవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.