ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో నోటీసులు అందుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆమె సోదరుడు, రాష్ట్ర మంత్రి కేటీ రామారావు చెప్పేవన్నీ అబద్ధాలేనని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢిల్లీకి వచ్చి మద్యం వ్యాపారం చేసి, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ముడుపులు ఇచ్చి, అక్రమంగా సొమ్ము చేసుకుని, ఆపై దర్యాప్తు మొదలుపెట్టగానే తెలంగాణ సమాజం పేరు చెప్పి సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
భారతీయ జనతా పార్టీ తమను టార్గెట్ చేసిందని చెబుతూ సానుభూతి పొందాలనుకుంటున్నారని ఆరోపించారు. అన్నా చెల్లెలు మీడియా సమావేశాల్లో చెప్పినవన్నీ అబద్ధాలేనని మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం తీరు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్న సామెతను తలపిస్తున్నదని విమర్శించారు.
“ఢిల్లీకి వెళ్లండి.. అక్కడ మద్యం వ్యాపారం చేసి స్కాం చేయండి.. అక్రమంగా డబ్బులు పోగేసుకోండి అని తెలంగాణ ప్రజలు, ఆడబిడ్డలు మీకేమైనా చెప్పారా? మీ అక్రమ వ్యాపారానికి, తెలంగాణ సమాజానికి ఎందుకు లింక్ పెడుతున్నారు?” అని ప్రశ్నించారు. మహిళలు చీదరించుకునేలా అక్రమ వ్యాపారం చేసింది మీరు. ముఖ్యమంత్రి కూతురు, ఒక మహిళ ఢిల్లీ నడిబొడ్డున అక్రమ వ్యాపారం చేసినందుకు తెలంగాణ పరువు పోయిందని కిషన్ రెడ్డి దుయ్యబట్టారు.
మద్యం కేసులో అరెస్ట్ కాబోతున్నారని తెలిసి మహిళా రిజర్వేషన్ల బిల్లు పేరుతో కొత్త నాటకానికి కల్వకుంట్ల కుటుంబం తెరలేపిందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇదంతా సానుభూతి కోసం చేస్తున్న డ్రామా అని ఆయనన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మాట్లాడుతున్నందుకు ఈడీ నోటీసులు ఇచ్చిందని చెబుతున్న కల్వకుంట్ల కుటుంబానికి ఆ బిల్లుపై మాట్లాడే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ మొదటి ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరని, ఇప్పటికీ రాజ్యసభకు ఆ పార్టీ ఒక్క మహిళను కూడా పంపలేదని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో శాసన మండలిలో ఆ పార్టీ ఎంత మంది మహిళలకు చోటు కల్పించిందని ప్రశ్నించారు. అలాంటి పార్టీకి మహిళా రిజర్వేషన్ల బిల్లు గురించి మాట్లాడే హక్కుందా? అని ప్రశ్నించారు.