ఆమ్ ఆద్మీ పార్టీ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ ఐపీఎస్ ఆఫీసర్ జ్యోతి యాదవ్ ను వివాహం చేసుకోబోతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇటీవలే హర్జోత్ సింగ్, జ్యోతి యాదవ్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల చివర్లో వీరిద్దరూ మూడు ముళ్లు, ఏడు అడుగుల బంధంతో ఒక్కటి కాబోతున్నట్లు పేర్కొన్నారు.
పంజాబ్ రూప్నగర్ జిల్లాలోని అనంద్పూర్ సాహిబ్ నియోజకవర్గం నుంచి హర్జోత్ సింగ్ తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా సింగ్ కొనసాగుతున్నారు. ఆనంద్పూర్ సాహిబ్ నియోజకవర్గంలోని గంభీర్పూర్ గ్రామానికి చెందిన బెయిన్స్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో షానేవాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2014లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ ఎల్ఎల్బీ పూర్తి చేశారు. 2018లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఇంటర్నేషనల్ హ్యుమన్ రైట్స్ లా సర్టిఫికెట్ పొందారు.
పంజాబ్ కేడర్కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ జ్యోతి యాదవ్ మాన్సా జిల్లా ఎస్పీగా కొనసాగుతున్నారు. హర్యానాలోని గురుగ్రామ్కు చెందిన యాదవ్ ఆప్ ఎమ్మెల్యే రాజేందర్పాల్ కౌర్తో వివాదం జరిగిన తర్వాత వెలుగులోకి వచ్చారు. తనకు తెలియకుండానే తన నియోజకవర్గంలో సెర్చ్ ఆపరేషన్ ఎలా నిర్వహిస్తారని ఎమ్మెల్యేతో జ్యోతి యాదవ్ గొడవకు దిగారు.