లిక్కర్ స్కాంలో మరో ఊహించని కీలక పరిణామం చోటుచేసుకుంది. కవిత సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్పై ఈడీ అధికారులు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. దానితో కవిత వేసిన పిటీషన్పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సుప్రీంకోర్టులో కేవియట్ పిటీషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.
అయితే మహిళా హక్కుల గురించి పిటీషన్లో కవిత పేర్కొంటూ కీలక అంశాలను అందులో ప్రస్తావించింది. తనను రాత్రి 8 గంటల నిమిషాల వరకు ఈడీ కార్యాలయంలో కూర్చొబెట్టడాన్ని కవిత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సూర్యాస్తమం తర్వాత మహిళను విచారణ కోసం కార్యాలయంలో కూర్చోబెట్టకూడదని చట్టం చెబుతోందని కవిత ఆ పిటీషన్లో పేర్కొంది.
ఒక మహిళను కార్యాలయానికి పిలిపించి విచారించవద్దని కవిత పిటీషన్ దాఖలు చేసింది. తమ వాదన వినేంతవరకు కవిత పిటీషన్పై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఈడీ సుప్రీంకోర్టును హడావిడిగా అభ్యర్థించడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈడీ బెదిరిస్తోందని, బలప్రయోగంతో పాటు థర్డ్ డిగ్రీ పద్ధతులు అవలంభిస్తోందని, తనపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. నళినీ చిదంబరం కేసులో మహిళను వ్యక్తిగతంగా హాజరుకావాలని ఒత్తిడి చేయబోమని ఈడీ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చిందని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అయినా కూడా తనను కార్యాలయానికి పిలిపించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. ఆమె పిటిషన్పై ఈ నెల 24న కోర్టు విచారణ జరపనుంది. అదే రోజు ఈడీ వాదనలు కూడా వినే అవకాశం ఉంది.