ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, మరో వ్యక్తి రోహిత్ గార్గ్ లపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సల్మాన్ ఖాన్ సన్నిహితుడికి రోహిత్ గార్గ్ పేరుతో బెదిరింపుతో కూడిన ఈ మెయిల్ వచ్చింది. హిందీలో ఇది రాసి ఉంది.
‘‘లారెన్స్ బిష్ణోయ్ ఇటీవలే ఓ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూని సల్మాన్ ఖాన్ తప్పకుండా చూడాలి. లేదంటే చూసేలా చేయాల్సి వస్తుంది. ఖాన్ ఒకవేళ ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని అనుకుంటే, గోల్డీ భాయ్ తో ముఖాముఖి మాట్లాడాలి’’ అన్నది ఈ మెయిల్ సారాంశం.
తన జీవిత లక్ష్యం సల్మాన్ ఖాన్ ను అంతం చేయడమేనని ఇంటర్వ్యూలో లారెన్స్ బిష్ణోయ్ చెప్పడం గమనించొచ్చు. సల్మాన్ ఖాన్ కు తాజా బెదిరింపుల నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భద్రతను ముంబై పోలీసులు కట్టుదిట్టం చేశారు.
సల్మాన్ ఖాన్ సన్నిహిత మిత్రుడు ప్రమోద్ గుంజాల్కర్ బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సెక్షన్ 506(2), 120(బీ), 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సల్మాన్ ఖాన్ కు, ఆయన తండ్రికి గతంలోనూ లారెన్స్ బిష్ణోయ్ ముఠా నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో ఆయనకు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించారు.
సల్మాన్కు గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు రావడం ఇది మొదటిసారేం కాదు. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఆ వన్యప్రాణుల్ని వేటాడటం ద్వారా సల్మాన్ఖాన్ బిష్ణోయ్ల మనోభావాలను దెబ్బతీశారంటూ లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించాడు. నటుడిని చంపేస్తామంటూ ప్రకటించాడు. అయితే, చివరకు ఈ కేసులో సల్మాన్ నిర్దోషిగా విడుదలయ్యారు.
గతేడాది పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత సల్మాన్కు బెదిరింపు లేఖ వచ్చింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్ భద్రతను కూడా పెంచింది. అప్పటికే ఉన్న ఎక్స్ గ్రేడ్ భద్రతను వై ప్లస్ గా అప్గ్రేడ్ చేసింది. దీంతో ఇద్దరు సాయుధ గార్డ్లు సల్మాన్కు అనునిత్యం భద్రతగా ఉంటున్నారు.
ఆయన ఇంటి వద్ద కూడా ఇద్దరు భద్రతా సిబ్బంది నిత్యం పహారా కాస్తున్నారు. ఆ తర్వాత మరికొందరు దుండగులు సల్మాన్ ఖాన్తోపాటు ఆయన తండ్రి సలీం ఖాన్ను చంపేస్తామని లేఖలు కూడా పంపారు. తాజాగా మరోసారి బెదిరింపులతో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.