దేశంలోనే స్కిల్ డెవలప్ మెంట్ స్కీమ్ అతిపెద్ద స్కామ్ అని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. స్కిల్ పేరుతో గత ప్రభుత్వం అడ్డంగా దోచేసిందని జగన్ అరోపించారు. ఇది రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్ అని అన్నారు. ఇలాంటి గొప్ప స్కామ్ నడిపిన వ్యక్తి చంద్రబాబు అని జగన్ విమర్శించారు.
స్కిల్ స్కామ్ లో చంద్రబాబు పాత్రపై ఆధారాలు చూపిస్తామని జగన్ చెప్పారు. చంద్రబాబు, ఆయన మనుషులు ఓ ముఠాగా ఏర్పడి ఓ పద్దతి ప్రకారం రూ.371 కోట్లు దోచేశారని జగన్ ఆరోపించారు. షెల్ కంపెనీల ద్వారా డబ్బులను మళ్లించి స్కామ్ కు పాల్పడ్డారని జగన్ చెప్పారు.
స్కిల్లింగ్ పేరుతో డబ్బులు దోచుకోవడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన విద్య అంటూ ఏ విధంగా ఓ వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తూ అడుగులు ఎలా పడ్డాయో ప్రజలకు తెలియాలని స్పష్టం చేశారు. వందరూపాయలు పనిచేస్తానని చెప్పి పది రూపాయలు అడ్వాన్స్ తీసుకుని, దాన్ని కూడా దోచుకున్న వ్యవహారం ఇది అని జగన్ ఆరోపించారు.
అమెరికా లాటరీ తరహా మోసం ఇది అని జగన్ తెలిపారు. ఈ స్కాం నడిపిన వ్యక్తి సాక్ష్యాత్తూ అప్పటి సీఎం చంద్రబాబేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ధనం రూ. 371 కోట్లు హారతికర్పూరంలా మాయమైపోయిందని, ఈ డబ్బు వివిధ షెల్ కంపెనీలకు రూటింగ్ చేసి తిరిగి వాటి నుంచి చంద్రబాబుకు వచ్చిందని పేర్కొన్నారు.
ఇది స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కాం అని జగన్ విమర్శించారు. అధికార దుర్వినియోగానికి పరాకాష్ట ఇదని చెప్పారు. కేబినెట్లో ఒకటి చెప్పి, దాని మేరకు జీవో ఇచ్చి, ఆ తర్వాత వాటికి విరుద్ధంగా ఓ ఎంఓయూ చేసుకున్నారని తెలిపారు. జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఐటీ, ఈడీ వంటి ఏజెన్సీలన్నీ ఈ స్కాంపై దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు.
ప్రజాధనాన్ని దోచేయడంలో బాబు ఎంత చాణిక్యుడో ఈ స్కామ్ ఓ ఊదహరణ అని చెప్పారు. స్కామ్ చేయడం దాని నుంచి తప్పించుకోవడం వరకు బాబు విజన్ కనిపిస్తుందని జగన్ విమర్శించారు. దోచుకో, పంచుకో, తినుకో అన్నదే బాబు విధానమని అన్నారు. ఈ స్కామ్ పై పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నాడో చెప్పాలని జగన్ ప్రశ్నించారు.