టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ఆరోపణలపై సిట్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని సిట్ పేర్కొంది. మార్చి 24వ తేదీన సిట్ ఎదుట హాజరవ్వాలని బండి సంజయ్ కు ఇచ్చిన నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు.
ఒకే ఊర్లో ఎక్కువ మందికి ర్యాంకులు వచ్చాయని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల క్రమంలో ఆయనకు సిట్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సైతం సిట్ నోటీసులు జారీ చేసింది. గ్రూప్-1 ప్రిలిమ్స్
గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో ఒకే మండలానికి చెందిన 100 మంది అభ్యర్థులు మంచి మార్కులు తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి ఆధారాలు ఏవైనా ఉంటే, సమర్పించాలని సిట్ అధికారులు కోరారు.
‘పేపర్ లీకేజీ కుట్ర వెనుక నా పాత్ర ఉందని కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ ఆరోపణలు చేశారు. నాపై ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించాలని కేసీఆర్ కొడుకుకు నోటీసులు జారీ చేసే దమ్ము సిట్ కు ఉందా..?’ అని సంజయ్ ప్రశ్నించిన మరుసటి రోజు ఈ నోటీసు ఇచ్చారు. కుట్రకు కారకులైన వారిని వదిలేసి ప్రతిపక్షాలకు నోటీసులు ఇవ్వడం ఏంటని సంజయ్ ప్రశ్నించారు. సిట్ నోటీసులకు విచారణకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
కాగా, పేపర్ లీక్ కేసులో నిందితురాలైన రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్లను అధికారులు ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వనపర్తి జిల్లా గోపాల్పేట్ మండలం బుద్ధారం బాలికల గురుకుల పాఠశాలలో హిందీ టీచర్గా రేణుక పనిచేస్తోంది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో రేణుక హస్తం ఉన్నట్లుగా తెలియడంతో స్కూల్ ప్రిన్సిపల్ వెంటనే ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రెటరీ రోనాల్డ్ రోస్కి నివేదిక పంపించారు. ఆ నివేదికను పరిశీలించిన అనంతరం రేణుకను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రేణుక భర్త డాక్యా నాయక్.. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపీడీఓ ఆఫీస్లో ఉపాధి హామీ స్కీమ్ టెక్నికల్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో అతడి పాత్ర కూడా ఉందని తేలడంతో అధికారులు అతడిని విధుల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్, ప్రవీణ్ కుమార్, రాజశేఖర్.. ఈ నలుగురు కీలక పాత్ర పోషించినట్లు సిట్ దర్యాప్తులో తేలింది.