మిత్రపక్షం బిజెపి తనతో సహకరించక పోవడం వల్లననే తాను టిడిపి వైపు వెళ్ళవలసి వస్తున్నట్లు అన్నట్లుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల మచిలీపట్టణం బహిరంగసభలో చేసిన వ్యాఖ్యలను బీజేపీ రాష్త్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్యెల్సీ పివిఎన్ మాధవ్ కొట్టిపారేసారు. పైగా, తమతో పవన్ కల్యాణ్ కలిసి రావడం లేదని మాధవ్ ఆరోపణలు చేశారు. జనసేనతో పొత్తు ఉన్న కూడా.. లేనట్టుగానే ఉందని అంటూ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాధవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
‘ఎమ్మెల్సీ ఎన్నికలలో సహకరించాలని కోరినా పవన్ స్పందించలేదు. పైగా కమ్యూనిస్టులు తమకు సపోర్ట్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దాన్ని ఖండించాలని కోరినా పవన్ కళ్యాణ్ ఖండించలేదు” అంటూ పేర్కొన్నారు.
గతంలోనూ తమ పార్టీ ఓటమి చెందినా పుంజుకున్న ఘటనలు ఉన్నాయని చెబుతూ ఎమ్మెల్సీ ఎన్నికలలో గతంలో కంటే బీజేపీకి మెరుగైన ఓట్లు వచ్చాయని సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, ఉత్తరాంధ్రలో మాత్రం బీజేపీ వైఫల్యం చెందిందని అంగీకరిస్తూ భవిష్యత్ లో ఎలాంటి అంశాలపై దృష్టిపెట్టాలో తమ పెద్దలు చెప్పారని మాధవ్ తెలిపారు.
పొత్తుల విషయం తమ జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని మాధవ్ స్పష్టం చేశారు. తాము పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. పవన్ చెప్పినట్టుగా ఇరు పార్టీల కార్యకర్తలు పని చేస్తే.. ఫలితాలు ఉంటాయని మాధవ్ చెప్పారు. ఆ విధంగా.. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఆలోచన చేయాలని కోరుతున్నామని తెలిపారు.