దేశంలో గృహహింస కేసుల జాబితాలో 50.4 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఈ జాబితాలో అసోం(75 శాతం) ప్రథమ స్థానంలో ఉండగా, ఢిల్లీ(48.9 శాతం) మూడో స్థానంలో ఉంది. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన ‘ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా-2022’ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
దేశంలో మహిళలపై జరుగుతున్న దాడుల్లో మూడో వంతు కట్టుకున్న భర్త, అతని బంధువుల నుంచే ఎదుర్కొంటున్నారు. ఉద్దేశపూర్వక దాడులు, కిడ్నాప్, అత్యాచార ప్రయత్న ఘటనలు.. మహిళలు ప్రధానంగా ఎదుర్కొంటున్నారు. ఈ రకమైన వేధింపులు 2015-16లో 33.3 శాతం ఉండగా, 2019-21 నాటికి కొద్దిగా తగ్గి 31.9 శాతానికి చేరాయి. అయినా మళ్లీ ఇప్పుడు పెరుగుతున్నట్లు సర్వే ఆందోళన వ్యక్తం చేసింది.
దేశవ్యాప్తంగా మహిళలపై దాడులకు సంబంధించి 2021 నాటికి కోర్టుల్లో 21.22 లక్షల కేసులున్నాయి. వీటిలో ఇప్పటివరకు 83,536 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ తరహా కేసుల విషయంలో కోర్టులు మరింత వేగం పెంచాల్సి ఉందని సర్వే అభిప్రాయపడింది.
ఇటు 2005లో 40,998 మంది మహిళలు ఆత్మహత్య చేసుకోగా, ఇది 2011 నాటికి 47,746కు పెరిగింది. కాగా 2021 నాటికి 45,026గా ఉన్నాయి. అయితే కొంతమేర తగ్గినట్టు నివేదికలో పొందుపరిచినా.. క్షేత్రస్థాయిలో జరిగిన ఘటనలు, నేషనల్ క్రైమ్ బ్యూరో దృష్టికి రాని కేసులు చాలా ఉన్నాయని సర్వే తెలిపింది. ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని సర్వే సూచించింది.
దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న దాడులను పరిశీలిస్తే ముఖ్యంగా ఇంట్లోనే వేధింపులు ఎక్కువగా ఎదుర్కొంటున్నారని స్పష్టమవుతోంది. 2016లో భర్త, అతడి బంధువుల నుంచి ఎదుర్కొన్న సమస్యలపై 1,10,378 ఘటనలు ఉండగా, ఇవీ 2021 నాటికి 1,36,234గా నమోదయ్యాయి.
ఇక అత్యాచార ఘటనలు 2016లో 38,947 ఉండగా, 2021నాటికి 31,677గా నమోదయ్యాయి. కిడ్నాప్ కేసులు 2016లో 64,519 ఉండగా, 2021 నాటికి 75,369గా ఉన్నాయి. ఉద్దేశపూర్వక వేధింపులు, లైంగిక వేధింపుల ఘటనలు 2016లో 84,746 ఉండగా, 2021 నాటికి 89,200కు చేరాయి.
వరకట్న వేధింపుల ఘటనలు సైతం పెరుగుతున్నాయి. ఇవి 2016లో 9,683 ఉండగా, 2021 నాటికి 13,568కు చేరాయి. మొత్తంగా మహిళలపై జరుగుతున్న దాడులు 2016లో 3,38,954 ఉండగా, ఇది 2021 నాటికి 4,28,278కి చేరాయి. ఇక ఇప్పటికీ బాల్య వివాహాలూ జరుగుతున్నాయని, వీటిల్లో బిహార్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు 40 శాతంతో ముందున్నట్లు సర్వే తెలిపింది. మహిళలపై జరుగుతున్న నేరాల శాతంలోనూ 6వ స్థానంలో తెలంగాణ ఉంది.
మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు మరింత సమర్థంగా పనిచేయాల్సి ఉందని సర్వే పేర్కొంది. ఇటు పనిచేసే స్థలాలు, ఎక్కువ పని గంటలు చేసే చోట మహిళలపై లైంగిక వేధింపులు చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. అయితే ప్రభుత్వాలు వీటి నివారణకు చర్యలు తీసుకుంటున్నా వాటిని మరింత మెరుగుపర్చుకోవాలని సర్వే సూచించింది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం మొత్తం కేసుల్లో 68 శాతం పోలీసుల ద్వారానే పరిష్కారమయ్యాయి. పాలసీ తయారీదారులు, ప్రభుత్వాలు ఈ సమస్యలపై దృష్టి సారించి వీటి నివారణకు చర్యలు తీసుకోవాలని, వీటిపై ప్రజలకు అవగాహనను కల్పించాలని సర్వే సూచించింది.