అదానీ అంశం, రాహుల్ గాంధీ అనర్హత వ్యవహారంపై విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ దద్దరిల్లింది. కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తూ సోమవారం బీఆర్ఎస్ రాజ్యసభ, లోక్సభ సభ్యులతో పాటు ప్రతిపక్షాల ఎంపీలు నల్ల చొక్కాలు వేసుకుని వచ్చి మరీ నిరసన తెలిపారు.
ఉభయసభలు ప్రారంభం కాగానే సభ్యులంతా ప్లకార్డులు చేత పట్టుకుని కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. ఒక దశలో సభ్యులంతా స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి, ఆందోళనకు దిగడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వ రద్దు అప్రజాస్వామికమని నినదించారు.
దీంతో స్పీకర్ ఓంబిర్లా లోక్సభను సాయంత్రం 4 గంటలకు, రాజ్యసభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. దీంతో బీఆర్ఎస్తో సహా విపక్ష సభ్యులంతా నిరసన వ్యక్తం చేస్తూ విజయ్ చౌక్ వద్దకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం అందరూ గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ ధర్నా చేశారు.
రాహుల్ గాంధీకి మరో షాక్
కాగా, మోదీ ఇంటిపేరు కలవారందరూ దొంగలే అనే వివాదాస్పద వ్యాఖ్యలతో పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. ఆయన ప్రస్తుతం ఉంటోన్న ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాలని లోక్సభ హౌజింగ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 22లోగా ఆయన తన బంగళాను ఖాళీ చేయాల్సి ఉంటుందని నోటీసుల్లో పేర్కొన్నారు. ఖాళీ చేయడానికి ఆయనకున్న వ్యవధి 26 రోజులు మాత్రమే. 2014 నుంచి రాహుల్ ఢిల్లీ 12 తుగ్లక్ లేన్ లోని ప్రభుత్వ బంగ్లాలో ఉంటున్నారు.