అమరావతి – 3 రాజధానుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో అటు అమరావతి రైతులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జులై 11కు వాయిదా పడింది. ఇంకా ముందే విచారణ చేపట్టి తీర్పునివ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. దానితో, పరిపాలనా రాజధానిగా విశాఖకు మార్చాలని తొందరపడుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు సుప్రీంకోర్టు షాకిచ్చింది.
జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన ధర్మాసనం విచారణ జరపాల్సిన కేసుల జాబితాలో మంగళవారం అమరావతి కేసుకు ఉంది. వరుస క్రమంలో 10వ స్థానంలో ఉన్నప్పటికీ, విచారణకు వచ్చేసరికి సాయత్రం గం. 4.00 దాటింది.
మధ్యాహ్నం భోజన విరామ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తమ కేసు విచారణ చేపట్టాలని ధర్మాసనాన్ని కోరగా కోర్టు పద్ధతులు పాటించాలని, వరుస క్రమంలో కేసు విచారణ చేపడతామని న్యాయమూర్తులు సున్నితంగా వారించారు. సాయంత్రం విచారణ చేపట్టే సమయానికి కోర్టు సమయం దాదాపుగా ముగిసిపోయింది.
ఈ పరిస్థితుల్లో తదుపరి విచారణ తేదీని జులై 11గా ధర్మాసనం ఖరారు చేసింది. అయితే ఇంకా ముందే విచారణ చేపట్టి కేసును త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేకే వేణుగోపాల్ సహా ఇతర న్యాయవాదులు ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. కనీసం ఏప్రిల్ నెలలోనైనా చేపట్టాలని పదే పదే కోరారు. అయినప్పటికీ ధర్మాసనం అంగీకరించలేదు.