కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు మే 10వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ బుధవారం ప్రకటించారు. మే 13వ తేదీన ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత కర్నాటక అసెంబ్లీ పదవీకాలం మే 24న ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఉదయం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది.
ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ఏప్రిల్ 13న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. మే 10న పోలింగ్ నిర్వహించి, మే 13న కౌంటింగ్ జరపనున్నట్లు పేర్కొన్నారు. నామినేషన్లకు ఏప్రిల్ 20 చివరి తేదీ కాగా, ఏప్రిల్ 21న నామినేషన్లను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు 24వ తేదీగా ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఈ ఎన్నికల్లో కొత్తగా ఒక వెసులుబాటును కల్పించారు. 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, వికలాంగులకు తమ ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు. రాష్ట్రంలో 100 ఏండ్లు పైబడిన ఓటర్లు సుమారు 17వేల మంది ఉన్నట్లు వెల్లడించారు.
‘కర్ణాటకలో 12.15 లక్షల మంది 80 ఏండ్లు దాటిన ఓటర్లు ఉన్నారు. వీరిలో 16,976 మంది శతాబ్ది (100 ఏండ్లు పైబడిన) ఓటర్లే. అలాగే, ఎన్నికల సంఘంలో 5.55 లక్షల మంది వికలాంగులు నమోదై ఉన్నారు’ అని రాజీవ్ కుమార్ వెల్లడించారు. వందేండ్లు పైబడిన ఓటర్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటకే కావడం గమనార్హం.
కర్ణాటకలో తొలిసారి 9.17 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆ రాష్ట్రంలో ఉన్న గిరిజన తెగల ప్రజల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు రాజీవ్ కుమార్ తెలిపారు. 224 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 58 వేల 282 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసినట్లు సీఈసీ వెల్లడించారు.
కర్నాటకలో మొత 5.21 కోట్ల మంది ఓటర్లు ఉండగా అందులో 2.62 మంది పురుష ఓటర్లు, 2.59 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు సగటున 883.50 ఓటర్లు ఉంటారన్నారు. అన్ని పోలింగ్ స్టేషన్లలో వెబ్కాస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. 1320 పోలింగ్ స్టేషన్లలను కేవలం మహిళా అధికారులే మేనేజ్ చేయనున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో 26.25 శాతం ఓట్లతో బిజెపి 104 స్థానాలు, 28.14 శాతం ఓట్లతో కాంగ్రెస్ పార్టీ 74 స్థానాలను గెలుచుకున్నాయి. 18.14 3శాతం ఓట్లతో 37 స్థానాలలో జెడి(ఎస్) గెలుపొందాయి. బిఎస్ యడియూరప్ప సారథ్యంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడి మూడవ రోజునే కూలిపోయింది.
ముఖ్యమంత్ర యడియూరప్ప తన రాజీనామాను గవర్నర్కు సమర్పించి భావోద్వేగంతో నిష్క్రమించారు. ఆ తర్వాత జెడి(ఎస్), కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే ఏడాదికే ఆ ప్రభుత్వం కూడా పతనమైంది. కాంగ్రెస్కు చెందిన 13 మంది ఎమ్మెల్యేలు, జెడిఎస్కు చెందిన ముగ్గురు, కర్నాటక ప్రజ్ఞావంత జనతా పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే బిజెపికి తమ మద్దతును ప్రకటించి రాజీనామాలు చేశారు.
దీంతో మళ్లీ యడియూరప్ప 2019 జులైలో ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. అయితే 2021లో ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. ఎస్ఆర్ బొమ్మై ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.