ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్లను ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) అందించాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది.
మోదీ అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ డిగ్రీలకు సంబంధించిన సమాచారాన్ని అందించాలని ప్రధాన సమాచార కమిషన్ (సీఐసీ) పీఎమ్ఓ, గుజరాత్ విశ్వవిద్యాలయం, ఢిల్లీ యూనివర్శిటీ పీఐఓలకు ఇచ్చిన ఆదేశాలను న్యాయమూర్తి బీరెన్ వైష్ణవ్తో కూడిన ఒక న్యాయమూర్తి ప్యానెల్ తోసిపుచ్చింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానమంత్రి డిగ్రీ సర్టిఫికెట్ కు చెందిన వివరాలను, వాటి ప్రత్యేకతలను అందజేయాలని చేసిన అభ్యర్థన గుజరాత్ హైకోర్టు తోసిపుచ్చడమే కాకుండా, అతనిపై 25 వేల రూపాయల జరిమానా కూడా విధించింది. చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ నిర్ణయాన్ని గుజరాత్ యూనివర్సిటీ అప్పీల్ చేయగా, హైకోర్టు ఇప్పుడు దానిని విచారిస్తోంది.
అంతేకాకుండా “ప్రజాస్వామ్యంలో, పదవిలో ఉన్న వ్యక్తి డాక్టరేట్ లేదా నిరక్షరాస్యుడు అనే తేడా ఉండదు. అలాగే, ఈ అంశంలో ప్రజాప్రయోజనాల ప్రమేయం లేదు. అతని గోప్యత కూడా దెబ్బతింటుంది” అని ఓ వెబ్సైట్ బార్ అండ్ బెంచ్ యూనివర్శిటీ తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఊటంకిస్తూ వార్త వెలువరించింది.
తాను 1978లో గుజరాత్ యూనివర్సిటీ నుంచి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని, 1983లో ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని పొందానని ప్రధాని నరేంద్ర మోదీ గతంలో పేర్కొనడం విశేషం.
కేజ్రీవాల్ తరపు న్యాయవాది పెర్సీ కవీనా వాదిస్తూ, “మీరు దాఖలు చేసిన నామినేషన్ ఫారమ్ను (ఎన్నికల సమయంలో దాఖలు చేసిన) చూస్తే అది అతని విద్యార్హతలను తెలియజేస్తోంది”. అందుకనే తాము డిగ్రీ సర్టిఫికేట్ అడుగుతున్నామని, అతని మెరిట్ కాదని వాదనలు వినిపించారు.
ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలు చెప్పాలని సమాచార హక్కు చట్టం కమిషనర్కు కేజ్రీవాల్ 2016లో లేఖ రాశారు. దీనిపై కమిషనర్ స్పందించి రాజనీతి శాస్త్రంలో మోదీ మాస్టర్స్ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఎంఏలో 62.3 శాతం మార్కులు వచ్చాయని, సెకండ్ ఇయర్లో రాజనీతిశాస్త్రంలో 64 మార్కులు, ఐరోపా-సామాజిక రాజనీతిజ్ఞతలో 62 మార్కులు, ఆధునిక భారతదేశం-రాజకీయ విశ్లేషణలో 69 మార్కులు, రాజనీతి మనోవైజ్ఞానిక శాస్త్రంలో 67 మార్కులు వచ్చినట్టు పేర్కొన్నారు.
అయితే, ఇదే అంశంపై కేజ్రీవాల్ ఢిల్లీ యూనివర్సిటీ వీసీకి మరోసారి లేఖ రాశారు. మోదీ డిగ్రీ పట్టాను యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరచాలని విజ్ఞప్తి చేశారు. దీంతో మోదీ విద్యార్హతల గురించి వెల్లడించాలని ప్రధాని కార్యాలయం, గుజరాత్ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీలను సమాచార కమిషనర్ ఆదేశించారు. ఈ ఉత్తర్వులను గుజరాత్ హైకోర్టులో గుజరాత్ యూనివర్సిటీ సవాల్ చేసింది. ఈ పిటిషన్పై సుదీర్ఘంగా విచారణ జరిపి తాజాగా తీర్పును వెలువరించింది.