బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనకు వైసీపీనే కారణమంటూ బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ దాడికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఈ సందర్భంగా అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా మందడంలో సభను నిర్వహించారు. రైతులకు మద్దతు తెలిపేందుకు సత్యకుమార్ , ఇతర నేతల వాహనాలు సీడ్ యాక్సిస్ రోడ్డు వద్దకు రాగానే అక్కడ ఉన్న 3 రాజధానుల శిబిరం నుంచి పలువురు ఒక్కసారిగా అడ్డుతగిలారు.
వాహనాలకు అడ్డంగా నిలబడి 3 రాజధానులకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఈ క్రమంలో బీజేపీ నేతల కార్లపై దాడికి దిగారు. ఈ ఘటనలో సత్య కుమార్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసుల ప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
ఈ ఘటనపై సత్య కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ “జగన్మోహన్ రెడ్డి రాక్షస వికృత క్రీడ గురించి నేను ఆ సభలో మాట్లాడాను. మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాల్లో వైషమ్యాలు సృష్టించారు. జగన్ తన విధ్వంసక రచనను బిజెపి ప్రశ్నించింది. తిరిగి వస్తుండగా మూడు రాజధానుల శిబిరం వద్ద పోలీసులు భారీగా ఉన్నారు. నా కారును పోలీసులు ఆపగానే మూకుమ్మడిగా మా వాళ్ల మీదకు వచ్చారు. అసభ్యంగా బూతులు తిడుతూ… కర్రలు, రాళ్లతో దాడి చేశారు” అని ఆరోపించారు.
“డీఎస్పీని ఇదేంటని అడిగినా స్పందించలేదు. పోలీసులు కూడా మా వాళ్లనే వెనక్కి నెట్టారు. మేము ఆ మార్గంలో వస్తామని తెలిసి పథకం రచించారు. మా కారు ఆపగానే దాడికి తెగబడ్డారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచివచ్చిన ఆదేశాలనే అమలు చేశారు” అని స్ఫష్టం చేశారు.
నందిగం సురేష్ అనే ఎంపి కొట్టిన వాళ్లకు మద్దతు ఇచ్చాడని పేర్కొంటూ మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తప్పించుకున్నాడని ఎంపి అన్నాడంటే అర్ధం ఏమిటి..? అని ప్రశ్నించారు. “జగన్మోహన్ రెడ్డి ఒక్కటి గుర్తు పెట్టుకో… మీరే కాదు, మేము కడప జిల్లా నుంచే వచ్చాం. పోలీసులను అడ్డం పెట్టుకుని ఈ డ్రామాలు ఎందుకు..? తేల్చుకునే పరిస్థితి వస్తే ధైర్యం గా దమ్ముగా రండి” అంటూ సత్య కుమార్ హెచ్చరించారు.
సత్యకుమార్పై వైసీపీ గూండాల దాడిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన సత్యకుమార్పై దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు.