తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు పొందేందుకు పోరాటం సాగిస్తున్న కీలక రాజకీయ ప్రత్యర్థులుగా భావించే బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ , టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లకు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ చేయడం రాజకీయంగా కలకలం రేపింది. పైగా, నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని, ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని ఆమె ప్రతిపాదించారు.
ప్రగతి భవన్ మార్చ్ పిలుపు నిద్ధామని పేర్కొంటూ కేసీఆర్ మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని ఆమె స్పష్టం చేశారు. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను రాష్ట్రంలో కేసీఆర్ బతకనియ్యడని షర్మిల హెచ్చరించారు. ఇక షర్మిలకు మద్దతు తెలిపిన బండి సంజయ్ త్వరలో సమావేశమవుదామని తెలిపారు. అటు రేవంత్ కూడా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు.
అయితే, జాతీయ స్థాయిలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడి కార్యాచరణకు కలసి రావడం రాజకకీయంగా సాధ్యమయ్యే విషయం కాదని అందరికి తెలిసిందే. షర్మిల మార్చి 31న టీఎస్ పీఎస్ సీ ముట్టడికి బయల్దేరగా ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పేపర్ లీకేజీపై షర్మిల స్పందించారు.
పేపర్ లీక్ కేసులో పెద్దవాళ్లను తప్పిస్తున్నారని, చిన్నవాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆందోళన అనగానే హౌస్ అరెస్ట్లు చేస్తున్నారని, తనకు లుకౌట్ నోటీసులు ఇచ్చారని షర్మిల తెలిపారు. లుకౌట్ నోటీసులు ఇవ్వడానికి తానేమన్నా క్రిమినల్నా? అంటూ షర్మిల ప్రశ్నించారు.
కాగా, గతంలో రేవంత్ రెడ్డిపై షర్మిల అనేక తీవ్ర విమర్శలు కురిపించారు. ఇటీవల రేవంత్ పాదయాత్రపై కూడా అనేక ఆరోపణలు చేశారు. రేవంత్ చేస్తున్నది పాదయాత్ర కాదని, కారు యాత్ర అంటూ విమర్శించారు. రేవంత్ నడవడం లేదని, ఆయన చేసేది పాదయాత్ర కాదంటూ ఆరోపించారు. పాదయాత్ర అంటే నడవాలని, కానీ రేవంత్ కారులో ప్రయాణిస్తున్నారంటూ షర్మిల వ్యాఖ్యానించారు.
గతంలో రేవంత్ రెడ్డి, షర్మిల ప్రజా సమస్యలపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో పలుమార్లు పాల్గొన్నారు. మరోవంక, పలు సందర్భాలలో షర్మిలకు బిజెపి మద్దతు ఇస్తున్నది. గతంలో షర్మిల పాదయాత్రను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఏకంగా షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్ చేసి పరామర్శించారు.