కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ నేత జగదీశ్ శెట్టర్ కాంగ్రెస్లో చేరారు. ఆదివారం ఎమ్మెల్యే పదవి, బీజేపీకి రాజీనామా చేసిన ఆయన సోమవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బెంగళూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, కాంగ్రెస్ నేతలు రణదీప్ సూర్జేవాలా, సిద్ధరామయ్య సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు.
హుబ్బళ్లి-ధార్వాడ్ సెంట్రల్ నియోజకవర్గం నుంచి జగదీశ్ కు కాంగ్రెస్ తరుపున టిక్కెట్ దక్కే అవకాశం ఉంది. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జగదీష్ గతంలో కర్ణాటక సీఎంగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు.
సీనియర్ నాయకుడనైన తనకు బీజేపీ నుంచి టిక్కెట్ వస్తుందని అనుకున్నాననని జగదీశ్ శెట్టర్ తెలిపారు. కానీ తనకు అది రాలేదని తెలియగానే షాక్కు గురయ్యానని తెలిపారు. ఎవరూ తనతో మాట్లాడలేదని, కనీసం ఒప్పించే ప్రయత్నం చేయలేదని చెప్పారు. తనకు బీజేపీ ఎలాంటి హామీ ఇవ్వలేదని జగదీశ్ శెట్టర్ స్పష్టం చేశారు.
అయితే, ఆయనకు రాజ్యసభకు పంపుతామని, కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకుంటామని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా హామీ ఇచ్చినట్లు మాజీ ముఖ్యమంత్రి బి ఎస్ యడ్డ్యూరప్ప, ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. వారిద్దరూ ఆదివారం ఆయనతో సమావేశపై పార్టీని విడనాడవద్దని సూచించారు. “పార్టీ మీకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది” అంటూ గుర్తు చేశారు.
కర్ణాటకలో మే 10న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెల్లడించనున్నారు. 224మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 119మంది, కాంగ్రెస్కు 75 మంది, జేడీఎస్కు 28మంది సభ్యులుండగా 2సీట్లు ఖాళీగా ఉన్నాయి.