మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ వివేకా కూతురు సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిపై అవినాశ్, సునీత తరఫు న్యాయవాదనలను ధర్మాసనం నిశితంగా విన్న తర్వాత కీలక ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలను తప్పుబడుతూ ముందస్తు బెయిల్ను నిలిపేసింది. విచారణకు లిఖిత పూర్వక ప్రశ్నలు ఇవ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించడాన్ని కూడా సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన రక్షణ తొలగిపోయింది.
వివేకా హత్యకేసు విచారణ గడువును జూన్ 30 లోపు ముగించాలని సీబీఐని తాజాగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంతకుముందు ఏప్రిల్ 30 లోపు విచారణ పూర్తి చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక హైకోర్టు బెయిల్పై తేల్చే వరకు తన క్లయింట్ను అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలివ్వాలని అవినాశ్ రెడ్డి తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు అంగీకరించలేదు.
అవినాశ్ రెడ్డిని సీబీఐ ఆరెస్ట్ చేస్తుందని మీరెందుకు ఉహించుకుంటున్నారు? అని ఎంపీ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. సీబీఐ అరెస్ట్ చేయదలచుకుంటే ఎప్పుడో చేసుండేది కదా? అని ఒకింత కోర్టు మండిపడింది. ఈ కేసులో సీబీఐ పూర్తి సంయమనంతో ఉందని తెలిపింది. మందస్తు బెయిల్ సంగతి తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది.
అవినాష్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పుడు సంప్రదాయానికి దారితీసేలా ఉన్నాయని, దర్యాప్తును కూడా ప్రభావితం చేసేలా ఉన్నాయన్న సీజేఐ ధర్మాసనం పేర్కొంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అవినాష్ను అరెస్ట్ చేయడానికి సీబీఐకి లైన్క్లియర్ అయినట్టేనని సర్వత్రా చర్చ జరుగుతున్నది.