త్వరలోనే లక్షలాది మందితో హైదరాబాద్ లో నిరుద్యోగ మార్చ్ చేపడుతామని బిజెపి రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించారు. సంగారెడ్డిలో చేపట్టిన బీజేపీ నిరుద్యోగ మార్చ్ లో మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనతో 30 లక్షల మంది జీవితాలను కేటీఆర్ నాశనం చేశారని విమర్శించారు.
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ కేసులో కేటీఆర్ ను బర్తరఫ్ చేసి.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగుతున్న నయా నిజాం, గడీల పాలనను బద్దలు కొట్టేందుకే నిరుద్యోగ మార్చ్ చేపట్టినట్లు సంజయ్ చెప్పారు. మరో ఐదు నెలల్లో బీజేపీ అధికారంలోకి వస్తదని బండి సంజయ్ స్పష్టం చేశారు.
బిశ్వాల్ కమిటీ చెప్పిన నివేదిక ప్రకారం తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల నియామక ప్రక్రియను ప్రారంభిస్తామని, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ బెదిరింపులకు తమ పార్టీ నాయకులెవరూ భయపడరని స్పష్టం చేశారు. ఆయనకే భయమంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.
కేసులు, రౌడీషీట్లు, జైళ్లు.. ఇలా ఎన్నిరకాలుగా వేధింపులకు గురి చేసినా బీజేపీ శ్రేణులు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఇప్పటికే సగం మందిపై నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టారని.. రౌడీషీట్లు, కమ్యునల్ కేసులు ఉన్నాయని, జైళ్లకు కూడా వెళ్లొచ్చారని తెలిపారు.
‘ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సరిగా జీతాల్లేవ్. రైతులకు రుణ మాఫీ అమలు కాలేదు. అకాల వర్షాలలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడం లేదు. మహిళలకు భద్రత లేదు. ఇంటికో ఉద్యోగం లేదు’ అని చెబుతూ ఇలా అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొన్న పరిస్థితుల్లో మళ్లీ అధికారంలోకి ఎలా వస్తానంటున్నావో చెప్పాలని కేసీఆర్ను సంజయ్ నిలదీశారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని నమ్మకం ఉంటే బీఆర్ఎస్ ఎందుకు పెట్టారో ఆలోచించాలని ప్రజల్ని కోరారు.కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని విమర్శించారు బండి సంజయ్. తొమ్మిదేళ్లలో 9 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ఇంత వరకు ఒక్క రైతు కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించలేదని ధ్వజమెత్తారు.
రైతులకు రుణమాఫీ చెయ్యలేదని.. అకాల వర్షాలకు నష్టపోతే ఒక్క రైతును కూడా ఆదుకోలేదని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదని..నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని మండిపడ్డారు బండి సంజయ్. మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టే అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తుందని ఆరోపించారు.