భోపాల్ టెర్రర్ లింక్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాద సంస్థ ‘హిజ్బ్ ఉత్ తహ్రీర్’ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మతమార్పిడులకు ప్లాన్ చేసినట్లు ఎటీఎస్ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. డార్క్వెబ్,కీ ఆఫ్ రైట్ పాత్ పేరుతో యూట్యూబ్ ఛానల్, తీమ్రా,రాకెట్ చాట్ యాప్స్తో యువతను ట్రాప్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రధానంగా మత మార్పిడులకే మహ్మద్ సలీం అలియాస్ సౌరభ్ రాజ్ వైద్య మాడ్యూల్ ఏర్పాటు చేశారు. ఈ మాడ్యూల్తో దేశవ్యాప్తంగా మెట్రో నగరాల యువతను టార్గెట్ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న యువతను ఆకర్షించేలా ప్లాన్ చేశారు. కీ ఆఫ్ రైట్ పాత్ పేరిట ఓ యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేసి అందులో ప్రసంగాలు పెట్టి షేర్ చేసేవారు.
భోపాల్కు చెందిన సౌరభ్ రాజ్2005 నుంచే ఇస్లాం వైపు ఆకర్షితుడయ్యాడు. ఇస్లాం సాహిత్యం,డార్క్వెబ్లో ఉగ్రవాద సంస్థల ప్రేరేపిత ప్రసంగాలను ఎక్కువగా చూసేవాడు. ప్రతి రోజూ ఇంట్లో నమాజ్ చేస్తుండేవాడు. ఫ్రెండ్స్,బంధువుల కుటుంబ సభ్యులకు ఇస్లామ్ గురించి వివరించేవాడు.
ఈ క్రమంలోనే పెద్దలు కుదిర్చిన సంబంధంతో ఓ హిందూ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో మత మార్పిడి చేసేందుకు యత్నించగా ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడి విడిపోయారు. తర్వాత మరో యువతిని పెళ్లి చేసుకుని మతం మార్చే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఆ తరువాత 2009లో మాన్సీ అగర్వాల్ అనే యువతిని వివాహం చేసుకున్నాడు.
మాన్సీ అగర్వాల్కు కూడ సౌరభ్ రాజ్ ప్రవర్తనపై అనుమానం వచ్చింది. ఇంట్లో నమాజ్ చేయడం ఇస్లాం సాహిత్యంపై ప్రశ్నించింది. ఈ క్రమంలోనే 2010లో సౌరభ్ రాజ్ పూర్తిగా మతం మార్చుకున్నాడు. ఇస్లాం సిద్ధాంతాలకు అనుగుణంగా తన పేరును కూడా మహ్మద్ సలీంగా రిజిస్టర్ చేసుకున్నాడు.
ఆ తరువాత మాన్సీ అగర్వాల్ను కూడా మతమార్పిడి చేశాడు. ఆమె పేరును రహెలాగా మార్చేశాడు. ఇద్దరూ షరియత్ నిబంధనల ప్రకారం ఖురాన్ సున్నహ్, హదీస్, ఫిఖా, షరియా,కలాం,సూఫీ లాంటి గ్రంథాలను చదివారు. షరియత్ మార్గంలో నడువడం అంటే ఇస్లాం లేదా అల్లాహ్ చూపిన మార్గంలో నడవడమని ప్రచారం చేసేవాడు.
కొంతకాలం స్థానిక యువతకు తీమ్రా, రాకెట్ చాట్ యాప్ ల ద్వారా తన ప్రసంగాలను పంపి వినిపించేవాడు. భోపాల్లో తన నెట్వర్క్లో సుమారు 50 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. పోలీసులు, నిఘా సంస్థలకు చిక్కకుండా మతపరమైన మీటింగ్స్ నిర్వహించేవారు. ఇందులోను మతమార్పిడులపై చర్చించేవారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ఈ క్రమంలోనే 2018లో సలీం హైదరాబాద్కు మకాం మార్చాడు. కొందరి సహకారంతో దక్కన్ కాలేజీలో ఫార్మాస్యూటికల్ బయోటెక్నాలజీ హెచ్వోడీగా జాయిన్ అయ్యాడు. కాలేజీలో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదని తెలిసింది. సిటీలో జరిగిన కొన్ని మతపరమైన సమావేశాలకు సలీం హాజరయ్యాడని ఇప్పటికే దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
ప్రధానంగా ఇతర మతాలకు చెందిన యువత, ఉద్యోగులను ఇస్లాం వైపు మళ్లించేందుకు సలీం మాస్టర్ మైండ్గా పనిచేసిట్లు తెలిసింది. హైదరాబాద్లో అరెస్ట్ అయిన ఆరుగురు అనుమానితులను ఏటీఎస్ పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించనున్నారు. ఆ తరువాత కూడా సిటీలో మరి కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది.