చలామణి నుంచి ఉపసంహరించుకున్న రూ. 2 వేల నోట్లను బ్యాంక్ల్లో మంగళవారం నుంచే మార్చుకోవచ్చు. ఈ నోట్లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆర్బీఐ సమయం ఇచ్చింది. నోట్లు మార్చుకునేందుకు 4 నెలల సమయం ఉన్నందున కస్టమర్లు వెంటనే బ్యాంక్లకు వెళ్లాల్సిన అవసరంలేదని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంతదాస్ చెప్పారు.
చలామణి నుంచి ఈ నోట్లను ఉపసంహరించుకుంటున్నప్పటికీ, గడువు వరకు చెల్లుబాటు అవుతాయని ఆయన స్పష్టం చేశారు. వ్యాపారులు రూ. 2000 నోట్లను తిరస్కరించడానికి వీలులేదని, తప్పనిసరిగా తీసుకోవాలని ఆర్బీఐ గవర్నర్ స్పష్టం చేశారు. నోట్ల రద్దు మూలంగా ఎన్-రెసిడెంట్ ఇండియన్స్(ఎన్ఆర్ఐ)లు, హెచ్1బీ వీసాలు ఉన్న వారి నోట్ల వెనక్కి తీసుకుంటున్నందున ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు.
నోట్లను ఉపసంహరించుకోవడం, కొత్త వాటిని జారీ చేయడం అనేది ఆర్బీఐ సాధారణంగా చేస్తూనే ఉంటుందని, ఈ సారి రూ. 2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నామని ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. సెప్టెంబర్ 30 నాటికి దాదాపు అన్ని 2000 నోట్లు వెనక్కి వస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. కస్టమర్లు నోట్లను మార్చుకునేందుకు వీలుగా అన్ని అవసరమైన ఏర్పాట్లు చేయాలని బ్యాంక్లను ఆయన ఆదేశించారు.
రూ. 2వేల నోట్లను 4-5 సంవత్సరాల క్రితం ప్రింట్ చేసినవని, వాటి లక్ష్యం కూడా పూర్తయిందని పేర్కొన్నారు. 2016లో చలామణిలో ఉన్న నోట్లను ఉపసంహరించుకున్నందున వ్యవస్థలోకి త్వరగా డబ్బును చొప్పించాలన్న లక్ష్యంతో రూ. 2వేల నోట్లను తీసుకు వచ్చామని, ప్రస్తుతం ఆ లక్ష్యం నెరవేరిందని చెప్పారు.
ప్రస్తుతం చలామణిలో తగినన్ని నోట్లు ఉన్నాయని చెప్పారు. ఒక దశలోరూ. 6 లక్షల 73వేల కోట్ల విలువైన రూ. 2వేల నోట్ల చలామణిలో ఉన్నాయని, ప్రస్తుతం అవి రూ. 3 లక్షల, 62 వేల కోట్లకు తగ్గిపోయినట్లు ఆర్బీఐ గవర్నర్ వివరించారు.
కాగా, సాధారణంగానే బ్యాంక్ల్లో రూ. 50వేల కంటే ఎక్కువ మొత్తాలను డిపాజిట్ చేస్తే పాన్కార్డు తప్పనిసరి సమర్పించాలనే నిబంధన ఇప్పటికే ఉందని ఆయన గుర్తు చేశారు. నగదు డిపాజిట్లకు ప్రస్తుతం ఉన్న నిబంధనలనే రూ. 2వేల నోట్ల డిపాజిట్ విషయంలోనూ అనుసరించాలని బ్యాంక్లను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
మంగళవారం నుంచి బ్యాంక్ల్లో నోట్ల మార్పిడికి అన్ని ఏర్పాట్లు చేశామని, మార్పిడికి అవసరమైన నగదు నిల్వలు ఉన్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో రూ. 2వేల నోట్ల స్థానంలో రూ. 1000 నోట్లను ప్రవేశపెట్టనున్నారని వస్తున్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. పెద్ద మొత్తంలో డిపాజిట్లను తనిఖీ చేసే అంశాన్ని ఆదాయ పన్ను శాఖ చూసుకుంటుందని చెెప్పారు.
నోట్ల మార్పిడి కోసం వచ్చే వారికి వేసవి కాలమైనందున నీడ, మంచినీటి వసతి ఏర్పాట్లు చేయాలని, అన్ని కౌంటర్లలో వీటిని మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని ఆర్బీఐ బ్యాంక్లను కోరింది.
ఒక వ్యక్తి ఒకసారి రూ. 20 వేల వరకు మాత్రమే రూ. 2వేల నోట్లను మార్చుకునే అవకాశం ఉందని ఆర్బీఐ తెలిపింది. అయితే, ఒక వ్యక్తి ఎన్నిసార్లయినా ఇలా రూ. 20వేల వరకు నోట్లను మార్చుకోవచ్చని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫేర్స్ (డీఈఏ) కార్యదర్శి అజయ్ సేథ్ స్పష్టం చేశారు. ప్రజలకు క్లీన్ నోట్స్ అందుబాటులో ఉంచేందుకే ఆర్బీఐ ఈ చర్య తీసుకుందని ఆయన చెప్పారు.