యూపీఎస్సీ సివిల్స్ 2022 తుది ఫలితాలు మంగళవారం విడుదల చేయగా వాటిల్లో తెలుగు తేజాలు సత్తాచాటారు. దేశవ్యాప్తంగా 933 మంది ఎంపిక అయ్యారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇషితా కిశోర్ తొలి ర్యాంకు సాధించగా, తెలంగాణకు చెందిన నూకల ఉమా హారతి మూడో ర్యాంక్ సాధించారు.
ఉమా హారతి నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు కుమార్తె. ఆమె స్వస్థలం సూర్యాపేట జిల్లాలోని హుజుర్నగర్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గుంటూరుపల్లికి చెందిన శాఖమూరి శ్రీసాయి హర్షిత్ సివిల్స్ మెయిన్స్ లో 40వ ర్యాంకు సాధించారు. జగిత్యాల జిల్లా ఐలాపూర్ గ్రామానికి చెందిన ఏనుగు శివ మారుతి రెడ్డి 132వ ర్యాంక్ సాధించారు.
అదే విధంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన బీవీఎస్ పవన్ దత్తా 22వ ర్యాంకు, హెచ్ఎస్ భావన 55వ ర్యాంకు, సాయి ప్రణవ్ 60వ ర్యాంకు, నిధి పాయ్ 110వ ర్యాంకు, అంకుర్ కుమార్ 257వ ర్యాంకు, చల్లా కళ్యాణి 285వ ర్యాంకు, వై శృతి 362వ ర్యాంకు, శ్రీకృష్ణ 293, హర్షిత 315, లక్ష్మి సుజిత 311, సోనియా కటారియా 376, రేవయ్య 410, సీహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి 426, రెడ్డి భార్గవ్ 772వ ర్యాంకు, నాగుల కృపాకర్ 866వ ర్యాంకులో నిలిచారు.
మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంతరం తుది ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మొత్తం 345 మంది జనరల్ కోటాలో ర్యాంకులు సాధించిగ 99 మంది ఈడబ్ల్యూ కోటా, 263 మంది ఓబీసీ కోటా, 154 మంది ఎస్సీ కోటాలో, 72 మంది ఎస్టీ కోటాలో వివిధ సర్వీసులకు ఎంపికయ్యారు.
సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష జూన్ 5, 2022న నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 11,35,697 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 5,73,735 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. మొత్తం 13,090 మంది అభ్యర్థులు సెప్టెంబర్ 2022లో జరిగిన రాత (మెయిన్) పరీక్షకు అర్హత సాధించారు.
మొత్తం 2,529 మంది అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్కు అర్హత సాధించారు. వీరిలో మొత్తం 933 మంది అభ్యర్థులను (613 మంది పురుషులు, 320 మంది మహిళలు) వివిధ సర్వీసులకు నియామకం కోసం యూపీఎస్సీ సిఫార్సు చేసింది.
మొదటి నాలుగు ర్యాంకులూ మహిళలవే
అర్హత సాధించిన అభ్యర్థుల్లో మొదటి నాలుగు స్థానాల్లో మహిళా అభ్యర్థులే ఉన్నారు. ఇషితా కిషోర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 2022లో మొదటి స్థానం సంపాదించారు. ఆమె పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫ్షనల్ సబ్జెక్ట్ ఎంచుకుని అర్హత సాధించింది. ఆమె దిల్లీ యూనివర్సిటీలోని శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి ఎకనామిక్స్ (ఆనర్స్)లో డిగ్రీ పొందారు.
గరిమా లోహియా దిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని కిరోరిమల్ కళాశాల నుంచి కామర్స్లో గ్రాడ్యుయేట్ అయ్యారు. కామర్స్ అకౌంటెన్సీని ఐచ్ఛిక సబ్జెక్ట్గా ఎంచుకుని రెండో ర్యాంక్ సాధించారు. ఉమా హారతి హైదరాబాద్లోని ఐఐటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేట్ (బి టెక్.) ఆంత్రోపాలజీ ఐచ్ఛిక సబ్జెక్ట్గా ఎంచుకుని మూడో స్థానంలో నిలిచారు.
స్మృతి మిశ్రా, మిరాండా హౌస్ కళాశాల, దిల్లీ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ (బిఎస్సి) జువాలజీని ఐచ్ఛిక సబ్జెక్ట్గా తీసుకుని నాల్గో ర్యాంక్ సాధించారు. మొదటి 25 మంది అభ్యర్థుల్లో 14 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నారు.