ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా మే 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బ్రిటీష్ నుంచి భారతీయులకు అధికార మార్పిడికి చిహ్నంగా వచ్చిన స్వాతంత్ర్యానికి సంబంధించిన ‘ముఖ్యమైన చారిత్రక’ చిహ్నం ‘రాజదండం’ని తిరిగి ప్రవేశపెడుతున్నట్లు కూడా ఆయన ప్రకటించారు.
“ఈ రాజదండంకు చాలా ప్రాముఖ్యత ఉంది. దీని గురించి ప్రధాని మోదీకి తెలియగానే, దాని గురించి మరింత సమాచారాన్ని పొందాలని కోరారు. ఆగస్టు 14, 1945న 10:45గంటలకు నెహ్రూ తమిళనాడు నుంచి వచ్చిన ఈ `రాజదండం’ను స్వీకరించారు. ఇది అధికార మార్పిడికి ప్రతీక”అని ఆయన పేర్కొన్నారు.
ఈ కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ముందు తమిళనాడు నుంచి ప్రధాని మోదీ రాజదండంను స్వీకరిస్తారని, ఆయన దానిని కొత్త పార్లమెంట్ భవన్లో ఉంచుతారని షా తెలిపారు. ఇది ఒక పునాది కార్యక్రమం కానుందని, భారతదేశంలో అమృత్ కాల్ని గుర్తు చేస్తుందని అమిత్ షా చెప్పారు.
మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్య్రం వచ్చినప్పుడు స్వీకరించిన ‘రాజదండం’ను కొత్త పార్లమెంటు భవనం లోపల ఉంచబడుతుందని మంత్రి తెలియజేశారు. దీన్ని అలహాబాద్లోని మ్యూజియంలో ఉంచామని, త్వరలోనే కొత్త పార్లమెంటు భవనానికి తరలించనున్నట్లు ఆయన ప్రకటించారు.
భారతీయ సంస్కృతితో ముఖ్యంగా తమిళ సంస్కృతిలో రాజదండంకు చాలా ప్రాముఖ్యత ఉందని అమిత్ షా పేర్కొన్నారు. చోళ రాజవంశం కాలం నుంచి దీనికి ప్రాధాన్యత ఉందని చెబుతూ ప్రధాని మోదీ దీనిని స్పీకర్ సీటు దగ్గర ఉంచుతారని ఆయన చెప్పారు.
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలన్న 19 ప్రతిపక్ష పార్టీల నిర్ణయంపై ఆయన స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిఒక్కరిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిందని, అయితే ఎవరి మనోభావాల మేరకు వారు స్పందిస్తారంటూ తెలిపారు.
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి పా ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు 19 ప్రతిపక్షాలు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఇప్పటివరకు బహిష్కరణ నిర్ణయాన్ని ప్రకటించిన పార్టీలలో..కాంగ్రెస్, టిఎంసి, డిఎంకె, జనతాదళ్(యునైటెడ్), ఆప్, ఎన్సిపి, శివసేన(యుబిటి), సిపిఎం, సమాజ్వాది పార్టీ, ఆర్జెడి, సిపిఐ, ఐయుఎంఎల్, జెఎంఎం, నేషనల్ కాన్ఫరెన్స్, కేరళ కాంగ్రెస్(మణి), ఆర్ఎస్పి, విడుదలై చిరుతైగల్ కట్చి, ముమలర్చి ద్రవిడ మున్నేట్ర కళగం, రాష్ట్రీయ లోక్ దళ్ ఉన్నాయి.