కేసీఆర్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజాధనం వృథా చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపి బండి సంజయ్ ఆరోపించారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ జిమ్మిక్కు అని ధ్వజమెత్తారు. రాష్ట్రపతితో పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు.
ఢిల్లీలో లిక్కర్ దందా చెసిన వారు తెలంగాణలో చేయలేరా? అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో పివి నరసింహారావు జయంతి జరిపిన రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ ఎందుకు జరుపలేదని ప్రశ్నించారు. బిఆర్ఎస్ పాలనలో ఏ వర్గం సంతోషంగా ఉందో చెప్పాలని నిలదీశారు.
కర్ణాటక ఎన్నికలకు, తెలంగాణకు సంబంధం ఏమిటి? ఎపిలో కాంగ్రెస్ గెలుస్తదా? అంటూ కర్ణాటక ఎన్నికల ప్రస్తావనను కొట్టిపారేశారు. కాంగ్రెస్ తెలంగాణలో ఏ విధంగా అధికారంలోకి వస్తుందని ప్రశ్నించారు. తనతో ఈటల, రాజగోపాల్ రెడ్డికి మధ్య గ్యాప్ ఉందనేది మీడియా కల్పనే అంటూ ధ్వజమెత్తారు.
ఒక వర్గం మీడియా బిజెపి గ్రాఫ్ను తగ్గించి కాంగ్రెస్, బిఆర్ఎస్ ఇమేజ్ ను పెంచాలని చూస్తున్నదని సంజయ్ ఆరోపించారు. “కోట్లు ముట్టినయని ఆధారాల్లేకుండా ఆరోపించడం సరికాదు… నిజంగా నేను గ్రానైట్ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుంటే ఆధారాలు బయటపెట్టడండి. అధికారంలో ఉన్నది బిఆర్ఎస్సే కదా… దమ్ముంటే చెప్పాలి” అంటూ సవాల్ చేశారు.
“నేను అమ్మవారి మీద ప్రమాణం చేసి చెబుతున్నా… నేను గ్రానైట్ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోలేదు. నా జీవితం తెరిచిన పుస్తకం. నా బ్యాంకు ఖాతాలు కూడా చెక్ చేసుకోవచ్చు” అని స్పష్టం చేశారు. ఎన్నికల్లో టిక్కెట్ల కోసం బిజెపిలో తీవ్రమైన పోటీ నెలకొందని చెప్పారు.