ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లీజుపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన ఆరోపణలను హైదరాబాద్ మహా నగర్ అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సీరియస్గా తీసుకుంది. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు రేవంత్ రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగా అబద్ధాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ లీగల్ నోటీసులు జారీ చేసింది.
నోటీసు అందిన 48 గంటల్లోగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. లోక్సభ సభ్యుడిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన ఏం మాట్లాడినా ప్రజల్లోకి విస్తృతంగా వెళుతుంది కాబట్టి చేసే ప్రతి ప్రకటన, మాట్లాడే మాటకు బాధ్యత ఉండాలని హితవు చెప్పింది.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఓఆర్ఆర్ను లీజుకు తీసుకున్నట్లు హెచ్ఎండీఏ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 9న టీవీఓటీ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసిందని, అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానించేందుకు టెండర్ల ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగిందని అధికారులు తెలిపారు.
అత్యధిక బిడ్ దాఖలు చేసిన ఐఆర్ బీ ఇన్ ఫ్రా డెవలపర్స్ లిమిటెడ్ కు లీజు ఖరారు చేస్తూ గత నెల 27న లెటర్ ఆఫ్ అవార్డ్ ఇచ్చామని వివరించారు. టెండర్ ప్రక్రియకు సంబంధించిన పత్రాలు, ఐఆర్బి ఇన్ఫ్రాకు జారీ చేసిన పత్రాలు, ఇతర వివరాలు ఆన్లైన్లో ప్రజలందరికీ అందుబాటులో ఉన్నాయని చెప్పారు.
ఓఆర్ఆర్ లీజుపై ప్రజలకు అన్ని విధాలుగా సమాచారం ఉన్నప్పటికీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పటికీ దానిపై రేవంత్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని నోటీసుల్లో హెచ్ఎండీఏ ఆరోపించింది.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కంటే ఓఆర్ఆర్ టోల్ స్కాం వెయ్యి రెట్లు పెద్దదని రేవంత్ రెడ్డి ఆరోపించాడు. ఢిల్లీ లిక్కర్ స్కాం తరహాలోనే ఓఆర్ఆర్ టోల్ స్కాం జరిగిందని చెబుతూ రూ. లక్ష కోట్ల ఆస్తిని కేవలం రూ.7 వేల కోట్లకు కట్టబెట్టారని ఆరోపించారు. ఈ ఓఆర్ఆర్ టోల్ స్కామ్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పాత్రదారులు కాగా.. మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఐఏఎస్ అర్వింద్ కుమార్ సూత్రదారులని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డు టీఓటీ టెండర్లు .కనీస ధర ప్రకటించకుండా పిలిచారని, ఇది నిబంధనలకు విరుద్దమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ అనుసరించి ఏ టెండరు పిలవాలన్నా 2031 లోపే పిలవాలని, కానీ ఓఆర్ఆర్ టెండరును 30 ఏండ్లకు కట్టబెట్టారని ఆరోపించారు. దేశంలో ఎక్కడైనా 15, 20 ఏళ్లకు టెండర్లు పిలుస్తాంటారని, కానీ తెలంగాణ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల విలువైన ఓఆర్ఆర్ ను 30 ఏళ్ల లీజుకు రాసిచ్చేసిందని రేవంత్ ధ్వజమెత్తారు. తద్వారా ఓఆర్ఆర్ ను అమ్మేస్తోందని విమర్శించారు.