పేదోళ్లను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానం అని ప్రధాని నరేంద్ర మోదీ ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్ని రోజులూ పేదలను తప్పుదారిపట్టిస్తూ అణిచివేతకు పాల్పడిందని విమర్శించారు.
‘‘పేదరికాన్ని నిర్మూలిస్తామని 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇన్నేళ్ల తర్వాత కూడా పేదరికాన్ని ఎందుకు రూపుమాపలేదు? అబద్ధాలు చెప్పి మోసం చేయడమే కాంగ్రెస్ పని. రాజస్థాన్ ప్రజలు కూడా కాంగ్రెస్ విధానాలతో నష్టపోయారు” అని మోదీ వ్యాఖ్యానించారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పార్టీ దేశ వ్యాప్తంగా చేపట్టిన నెలరోజుల ప్రచార కార్యక్రమాన్ని బుధవారం రాజస్థాన్ లోని అజ్మీర్ ర్యాలీలో పాల్గొని ప్రధాని ప్రారంభించారు.
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించడం ద్వారా కాంగ్రెస్, ఇతర ప్రజలు దేశ ప్రజలను, ఆ భవన నిర్మాణంకోసం శ్రమించిన 60,000 మంది కార్మికులను అవమానంపై గురిచేసిందని ప్రధాని మండిపడ్డారు. భారత దేశం సాధిస్తున్న విజయాలను కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలను విమర్శించారు చరిత్రలో ఎప్పుడో ఒకసారి జరిగే పార్లమెంటు కొత్త భవనంపై కూడా రాజకీయాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
తమ తొమ్మిదేళ్ల హయాంలో దేశ ప్రజలకు మంచి పాలన అందించామని, పేదల సంక్షేమానికి కృషి చేశామని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. 2014కు ముందు అవినీతిని వ్యతిరేకిస్తూ ప్రజలు రోజూ రోడ్లపైకి వచ్చేవారని, కాంగ్రెస్ పార్టీ పాలనలో టెర్రర్ దాడులతో ప్రధాన నగరాలు దద్దరిల్లేవని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ రిమోట్ కంట్రోల్ ద్వారా ప్రభుత్వాన్ని నడిపిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో దేశం అవినీతిలకు కూరుకుపోవడంతో దేశాభివృద్ధిని మంటగరిపిందని ధ్వజమెత్తారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, కైలాష్ చౌదరి, రాజస్థాన్కు చెందిన బీజేపీ నేతలు పాల్గొన్నారు.
అంతకుముందు అజ్మీర్ జిల్లా పుష్కర్లో బ్రహ్మదేవుడి ఆలయాన్ని మోదీ సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బహిరంగ ర్యాలీ కోసం హెలికాప్టర్లో అజ్మీర్ కు బయలుదేరారు.