2018లో ఎన్డీయేతో తెగతెంపులు చేసుకొని, కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలలో అధికారాన్ని పంచుకోవడానికి స్వస్తి పలికిన తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మొదటిసారిగా శనివారం రాత్రి బిజెపి అగ్రనేతలు అమిత్ షా, జెపి నడ్డలతో భేటీ జరపడం తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో కలకలం రేపుతున్నది. ఐదేళ్ల క్రితం తెంచుకున్న పొత్తులకు రెండు పార్టీలు తిరిగి తెర ఎత్తుతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
అయితే, ఇవి ప్రాధమిక చర్చలే అని, ఇంకా ఎటువంటి నిర్ణయానికి రాలేదని రెండు పార్టీల నేతలు స్పష్టం చేతున్నా రెండు రాస్త్రాలలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలోనే వారి భేటీ జరిగిన్నట్లు మాత్రం స్పష్టం అవుతున్నది. మరికొన్ని నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాదిలో రాష్ట్రంలో జరిగే సార్వత్రిక ఎన్నికల పొత్తులపై చర్చలు జరిగినట్లు సమాచారం.
ఇటీవల తెలంగాణ బిజెపి నేతలు అమిత్ షా, జెపి నడ్డాతో సమావేశం కావడం, అంతకముందు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జెపి నడ్డాతో సమావేశం అయ్యారు. ఆయా భేటీల్లో పొత్తులపై చర్చకు వచ్చింది. దీంతో చంద్రబాబుకు బిజెపి అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు టిడిపి వర్గాలు పేర్కొన్నాయి.
ఏప్రిల్ 3, 4 తేదీల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజెపి జాతీయ నాయకత్వంతో రెండు రోజులపాటు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. బిజెపి, టిడిపి, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తే మంచిదని జనసేనాని బిజెపి నేతలకు చెప్పినట్లు సమాచారం. అయితే బిజెపి నేతలు మాత్రం అందుకు ఇప్పటివరకు సుముఖత వ్యక్తం చేయడం లేదు.
బిజెపి కలిసి రాకపోయినా, టిడిపి, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తామని పవన్ కల్యాణ్ తెగేసి చెప్పినట్లు సమాచారం. బిజెపి, టిడిపి మధ్య రాయబారిగా పవన్ వ్యవహరించారని, ఇప్పుడు చంద్రబాబును కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపించుకోవడం పవన్ రాయబారంలో భాగమే అని చర్చ జరుగుతుంది.
మరోవైపు తెలంగాణలో బిజెపికి టిడిపి అవసరం ఉంది. కావున బిజెపి అధినాయకత్వం చంద్రబాబుతో సయోద్యకు సిద్ధమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో బిజెపి నేతల పిలుపు కోసం ఎదురుచూస్తున్న చంద్రబాబు, అమిత్ షా పిలుపుతో హుటాహుటిన ఢిల్లీ పర్యటనకు వచ్చారు.
మరోవంక, ఏపీలో ఎన్నికలు ఎదుర్కోవాలంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ దౌర్జన్యం నుండి రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వ అండ అవసరమని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకనే ఆయన కొంతకాలంగా బిజెపికి సానుకూల సంకేతాలు పంపుతున్నారు.