అత్యాచార బాధితురాలి జాతకాన్ని పరిశీలించాలంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై భారత ప్రధాన న్యాయమూర్తి డివై. చంద్రచూడ్ మండిపడ్డారు. విదేశాల్లో ఉన్న ఆయన అలహాబాద్ ఆదేశాల గురించి తెలుసుకుని, ఈ అంశంపై మరో ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రిజిస్ట్రీని ఆదేశించినట్లు సుప్రీంకోర్టులోని ఉన్నత వర్గాలు మీడియాకు తెలిపాయి.
సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు కావడంతో పాటు శనివారం, ఆదివారం కేసుల విచారణ జరగనప్పటికీ సిజెఐ స్పందించడం విశేషమని ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో శనివారం న్యాయమూర్తులు సుధాన్షు ధులియా, పంకజ్ మిథాల్లు మధ్యాహ్నం 3.00 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.
ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఈ ఆదేశాలను జారీ చేసిందని ఫిర్యాదు దారు తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ ఆదేశాలు సమస్య నుండి తప్పించే విధంగా ఉన్నాయని, కేసుకి, దీనికి సంబంధం ఏమిటని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.
గోప్యత హక్కుకు భంగం కలిగించడంతో పాటు ఇతర అంశాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసు విచారణను వచ్చే జులై నాటికి వాయిదా వేసింది. వివరాల ప్రకారం.. అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న అలహాబాద్ యూనివర్శిటీ ప్రొఫెసర్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు.
బాధితురాలి జాతకంలో కుజదోషం ఉండటంతో తాను ఆమెను వివాహం చేసుకోలేనని ఆ పిటిషన్లో పేర్కొన్నాడు. అతని వాదన వాస్తవమో కాదో తెలుసుకునేందుకు ఆ మహిళ జాతకాన్ని అధ్యయనం చేయాలని లక్నో విశ్వవిద్యాలయం జ్యోతిష్య శాస్త్ర విభాగం అధిపతిని హైకోర్టు ఆదేశించింది. ఆ మహిళ జాతకాన్ని వారం రోజుల్లోగా సీల్డ్ కవర్లో సమర్పించాలని ఆదేశించింది.