బాలాసోర్ రైళ్ల ప్రమాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విచారణ ప్రారంభించింది. మంగళవారం ఉదయం 10 మంది సీబీఐ అధికారుల బృందం బాలాసోర్లోని ప్రమాదస్థలికి చేరుకుంది. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి ఘటనకు గల కారణాలపై అన్వేషణ చేపట్టింది.
రాష్ట్ర పోలీసులు సేకరించిన సాక్ష్యాలు, వాంగ్మూలాలను సీబీఐ పరిశీలించింది.
రైల్వే మంత్రిత్వ శాఖ అభ్యర్థన, ఒడిశా ప్రభుత్వ సమ్మతితో కేంద్ర హోం శాఖ, డిఓపీటీ ఉత్తర్వులకు అనుగుణంగా సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా, బాలాసోర్ రైలు దుర్ఘటనపై ఒడిశా పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు.
నిర్లక్ష్యంతో ప్రాణాలకు హాని కలిగించడం, మరణాలకు కారణమవ్వడం వంటి అభియోగాలతో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ ఘటనలో కుట్ర కోణం ఉందన్న ఆరోపణలపై సిబిఐ ప్రత్యేక దృష్టి సారించనుంది. రైళ్లు సురక్షితంగా నడవడంలో అత్యంత కీలకమైన ‘ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థ’లో మార్పులు చేయడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో వెల్లడించింది.
అయితే, ఇది ఉద్దేశపూర్వకమేనా? ప్రమాదం వెనుక కుట్ర ఏమైనా ఉందా? అనే అంశాలపై సిబిఐ ఫోకస్ పెట్టింది.. విధ్వంసక చర్యకు పాల్పడేందుకే కొందరు వ్యక్తులు ఇంటర్లాకింగ్ వ్యవస్థలో మార్పు చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఎవరో వ్యవస్థలో జోక్యం చేసుకోనిదే మెయిన్లైన్కు ఖాయం చేసిన రూటును లూప్ లైనుకు మార్చడం సాధ్యం కాదని రైల్వే అధికారి ఒకరు తేల్చి చెప్పారు.
ఖరగ్పూర్, బాలాసోర్తో సహా పలు ప్రాంతాల్లో రైల్వే సేఫ్టీ కమిషనర్ బృందం కూడా పని చేస్తుంది. వారు మొత్తం సమాచారాన్ని సేకరిస్తున్నారు. లోకో పైలట్ మరణానికి సంబంధించి కొన్ని నకిలీ వార్తలు ప్రచారం అవుతున్నాయి. కానీ స్టేషన్ మాస్టర్, లోకో పైలట్ ఆరోగ్యం నిలకడం ఉందని, వారు భువనేశ్వర్లో చికిత్స పొందుతున్నారని అధికారులు ఇంతకుమునుపే వెల్లడించారు.