పోలవరాన్ని అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని, నిర్వాసితుల పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ప్రాజెక్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడైన పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలని పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలు ఇక్కడ హోటల్ ఏర్పాటు కూడా చేయాలని మౌలిక సదుపాయాలు ఏర్పాటుతో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన అనంతరం అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు.
జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ప్రాజెక్ట్ అధికారులు ఇంజనీర్లు ప్రాజెక్టు నిర్మాణ పనులను సమగ్రంగా ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను సైతం ఆయన పరిశీలన జరిపి తదుపరి సంభంధిత అధికారులతో సమగ్రంగా సమీక్ష జరిపారు.
ఇటీవల కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ఆధ్వర్యంలో జల శక్తి సంఘం 2025 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలోనూ పనులను పూర్తిచేసేందుకు గాను 12911 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసేందుకు కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఏరియల్ సర్వే ఫోటో ఎగ్జిబిషన్ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సంబంధిత ఇంజినీర్లు అధికారులతో సమీక్షించారు. ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్ దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ వద్ద జరుగుతున్న పనులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు.
గత సీజన్లో అనూహ్యంగా వచ్చిన వరద విపత్తులు తట్టుకునేందుకు ఎగువకాఫర్ డ్యాం ఎత్తు పెంపు పనులను సైతం ఆయన పరిశీలించారు. అలాగే ఇటీవల నిర్మాణం పూర్తి చేసుకున్న దిగువ కాఫర్ డ్యాంను కూడా ముఖ్యమంత్రి పరిశీలించారు. షెడ్యూల్ ప్రకారం నిర్వాసిత కుటుంబాల అందరిని తరలించేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.