ఆర్బీఐ వడ్డీ రేట్ల పెంపు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఈసారి కూడా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆర్బీఐ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం ప్రకటించారు.
రెపో రేటును 6.50 శాతం వద్ద అలాగే కొనసాగుతుందని తెలిపారు. ఎస్డీఎఫ్ రేటు 6.25 శాతం, ఎంఎస్ఎఫ్ రేటు 6.75 శాతం, బ్యాంక్ రేటు 6.75 శాతం వద్ద స్థిరంగా ఉంటాయని వెల్లడించారు. గత ఏప్రిల్లో జరిగిన తొలి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కూడా వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే అంతకుముందు మాత్రం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించాలనే కారణంతో 2022 మే నుంచి వరుసగా ఆరుసార్లు రెపో రేటును పెంచేసింది. ఆరు విడతల్లో 250 బేసిస్ పాయింట్లు పెంచి రుణ గ్రహీతలపై భారం పెంచింది. కానీ ఈసారి మాత్రం వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో వారికి ఉపశమనం కలిగినట్లయింది.
భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ముందుకు వెళ్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. కీలక పాలసీ రేట్లపై గురువారం ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ వాస్తవ వృద్ధి రేటును 6.4% గా నిర్ధారించారు. తొలి త్రైమాసికం Q1 లో 7.8%, Q2 లో 6.2%, Q3 లో 6%, Q4 లో 5.8% వృద్ధి రేటును అంచనా వేశారు.
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ గురువారం ప్రధానంగా ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం, అభివృద్ధి కి సహకారాన్ని అందించడం లక్ష్యాలుగా నిర్ణయాలు తీసుకుంది. అంతర్జాతీయంగా కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగయ్యాయని, గతంలో ఉన్నంత దారుణంగా లేవని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితులలో కూడా భారత ఆర్థిక వ్యవస్థ గుణాత్మక ఫలితాలను సాధిస్తూ, ముందుకు వస్తోందని పేర్కొన్నారు.