ఎన్సీపీలో అసంతృప్తిగా ఉన్న ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ మరోసారి తిరుగుబాటు జెండా ఎత్తారు. తన మద్దతు ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి ఎన్సీపీలో మరోసారి చీలిక తెచ్చారు. తన మద్దతుదారులతో కలిసి మహారాష్ట్రలో అధికారంలో ఉన్న బీజేపీ – షిండే శివసేన కూటమి నేతృత్వంలో ఉన్న ఏక్ నాథ్ షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు.
ఈ క్రమంలోనే ఆదివారం వేగంగా జరిగిన పరిణామాలలో అజిత్ పవార్ సహా మరో 9 మంది ఎమ్మెల్యేలు మహారాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా మూడేసారి అజిత్ పవర్ ఉపముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికే ఉపముఖ్యమంత్రిగా ఉన్న దేవేంద్ర ఫడ్నవిస్ తో కలిసి ఈ పదవిని పంచుకోనున్నారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను అజిత్ పవార్ కలిశారు. ఎన్సీపీకి మొత్తం 53 మంది శాసనసభ సభ్యులు ఉండగా అందులో 40 మంది అజిత్ పవార్ వెనకాల ఉన్నట్లు చెబుతున్నారు. అనంతరం అంతా కలిసి రాజ్భవన్ వెళ్లి అక్కడ గవర్నర్ రమేశ్ బైస్ను కలిశారు.
అనంతరం అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా, మరో 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. పవార్తోపాటు ఆయన వర్గానికి చెందిన చగన్ భుజ్బల్, దిలీప్ వాల్సే పాటిల్ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ పరిణామాలన్నీ ఒకదాని వెంట ఒకటి చకచకా జరిగిపోయాయి.
అంతకుముందు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలతో విడిగా అజిత్ పవార్ తన నివాసంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు సుప్రియా సూలే, ప్రఫుల్ పటేల్ హాజరయ్యారు. అయితే ఇటీవల అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినట్లు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించడం, ఆ తర్వాత మద్దతు దారుల ఒత్తిడితో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం తెలిసిందే.
ఆ తర్వాత పార్టీకి ఇద్దరు వర్కింగ్ ప్రెసిడెంట్లను శరద్ పవార్ నియమించారు. అందులో ఒకరు శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే కాగా, మరొకరు పార్టీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్. అయితే కీలక పదవుల నుంచి తనను పక్కకు పెట్టారని అజిత్ పవార్ అప్పటి నుంచి గుర్రుగా ఉన్నారు. సరైన సమయం చూసి ఎన్సీపీలో తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు.
కాగా,2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాకపోవడంతో ఆ సమయంలోనే బీజేపీతో చేతులు కలపిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం కూడా చేశారు. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమానస్వీకారం చేశారు. అయితే శరద్ పవార్ తన చాణక్యంతో అజిత్ పవార్ ను తన దోవకు తెచ్చుకొని బిజెపి ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చారు.
శరద్ పవర్ చొరవతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలతో మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఏక్ నాథ్ షిండే తిరుగుబాటుతో శివసేనలో చీలక వచ్చి మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. బీజేపీ మద్దతుతో షిండే సీఎం అయ్యారు. ఇప్పుడు మరోసారి ఎన్సీపీలో తిరుగుబాటు జెండా ఎగురవేసిన అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అయ్యారు.