భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది. 15 ఏళ్ళ కాలంలో మొత్తంగా 41.5 కోట్ల మంది దారిద్య్రం నుండి బయటపడ్డారని తెలిపింది. ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశం 2005-2006 నుండి 2019-2021 మధ్య కాలంలో ఈ విషయంలో గణనీయమైన పురోగతి సాధించిందని ఆ నివేదిక పేర్కొంది.
మహాత్మ గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం వల్లే పేదరికం తగ్గుముఖం పట్టడానికి ప్రధాన కారణమని గ్రామీణాభివృద్ధి రంగ నిపుణులు విశ్లేషించారు. 2006లో ప్రారంభమైన ఈ పథకం పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చిన నాటి నుంచే పేదరికం తగ్గుముఖం పడుతూ వచ్చిందని పేర్కొంటున్నారు.
ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యుఎన్డిపి), ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనీషియేటివ్ (ఒపిహెచ్ఐ)లు ఆక్స్ఫర్ట్ యూనివర్శిటీలో అంతర్జాతీయ బహుముఖ దారిద్య్ర సూచిక (ఎంపిఐ)ను విడుదల చేశాయి. భారత్తో సహా 25 దేశాలు 15 ఏళ్ళ కాలంలో తమ అంతర్జాతీయ ఎంపిఐ విలువలను విజయవంతంగా సగానికి సగం తగ్గించాయని నివేదిక పేర్కొంది.
కంబోడియా, చైనా, కాంగో, హోండూరస్, భారత్, ఇండోనేషియా, మొరాకో, సెర్బియా, వియత్నాం ఈ జాబితాలో వున్నాయి. 142.86 కోట్ల జనాభాతో భారత్ ఏప్రిల్లో చైనాను అధిగమించి అధిక జనాభా కలిగిన దేశంగా మారింది. 2005-06లో 55.1 శాతంగా వున్న దారిద్య్రం 2019-21 నాటికి 16.4 శాతానికి తగ్గింది.
పేదరికాన్ని నిర్మూలించడమన్నది సాధించవచ్చని ఈ నివేదిక తెలియచేస్తోంది. అయితే, కోవిడ్ సమయంలో సమగ్ర డేటా కొరవడడంతో తక్షణావకాశాలను అంచనా వేయడంలో సవాళ్లు ఎదుయ్యాయని ఆ నివేదిక పేర్కొంది.
110 దేశాల్లో 610 కోట్ల మందిలో 110 కోట్ల మంది దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారని నివేదిక వెల్లడించింది. సబ్ సహారా ఆఫ్రికా, దక్షిణాసియాల్లో అయితే ప్రతి ఆరుగురిలో ఐదుగురు పేదరికంలో మగ్గుతున్నారని తెలిపింది. పేదల్లో దాదాపు మూడింట రెండు వంతుల మంది (73కోట్ల మంది) మధ్యాదాయ దేశాల్లో జీవిస్తున్నారు.
ఈ దేశాల్లో చర్యలు తీసుకోవడం అంతర్జాతీయంగా దారిద్య్రాన్ని తగ్గించడానికి కీలకం. తక్కువ ఆదాయం కలిగిన దేశాలు మొత్తం జనాభాలో కేవలం 10 శాతమే వున్నప్పటికీ అక్కడ 35 శాతం మంది పేదలు నివసిస్తున్నారు. 18 ఏళ్ళలోపు పిల్లల్లో దారిద్య్రం రేటు 27.7 శాతంగా వుంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం వేధిస్తోంది. పేదల్లో 84 శాతం మంది గ్రామీణ ప్రాంతాల్లోనే జీవిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాలే దారిద్య్రంలో మగ్గుతున్నాయి.