ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గత కొన్నేళ్లలో వేల సంఖ్యలో బాలికలు, మహిళలు అదృశ్యమయ్యారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం రాజ్యసభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఈ విషయం తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఏటా వేల సంఖ్యలో అదృశ్యం కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. 18 ఏళ్ల లోపు బాలికలు, 18 ఏళ్లు దాటిన మహిళల అదృశ్యంపై నమోదైన వివరాలను వెల్లడించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత మూడేళ్ళలో 72,767 మంది అదృశ్యమైనట్టు చెప్పారు.
వీరిలో 15,994 బాలికలు, 56,773 మహిళలు ఉన్నట్లు తెలిపారు. 2019 నుండి 2021 వరకు మూడేళ్లలో ఏపీలో మొత్తం 7,928 మంది బాలికలు, 22,278 మహిళలు చెప్పారు. 2019లో 2,186 మంది బాలికలు, 6,252 మంది మహిళలు, 2020లో 2,374 మంది బాలికలు, 7,057 మంది మహిళలు అదృశ్యమయ్యారని గణాంకాలు విడుదల చేశారు.
2021లో 3,358 మంది బాలికలు, 8,969 మంది మహిళలు అదృశ్యమైనట్టు తెలిపారు. తెలంగాణలో 2019 నుండి 2021 వరకు మూడేళ్లలో మొత్తం 8,066 మంది బాలికలు, 34,495 మహిళలు అదృశ్యమయ్యారని కేంద్ర మంత్రి చెప్పారు. జాతీయ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలికలు, మహిళల అదృశ్యమవుతున్న కేసులు ఏటేటా పెరుగుతున్నాయని చెప్పారు.
ఏపీలో వాలంటీర్లు సేకరిస్తున్న డేటాను అక్రమ మానవ రవాణాకు ఉపయోగించు కొంటున్నారని, భారీ సంఖ్యలో రాష్ట్రంలో మహిళల మిస్సింగ్ కేసులు ఉన్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపిన నేపథ్యంలో ఈ వివరాలు సంచలనంగా మారాయి.