తెలంగాణలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ శుక్రవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డిని కలిశారు. జయసుధ బిజెపిలో చేరనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇదే అంశంపై కిషన్ రెడ్డి చర్చించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా, సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జయసుధ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె 2009లో పార్టీ టికెట్పై సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
బిజెపిలో చేరేందుకు జయసుధ గతంలోనే చర్చలు జరిపినట్లు ప్రచారం జరిగింది. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ నిర్మాతతో కలిసి ఆమె బీజేపీ నేతలను కలిశారని సమాచారం. పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ తో జయసుధ చర్చలు జరిపినట్లు బిజెపి వర్గాలు వెల్లడించాయి.
అయితే అప్పట్లో జరిగిన చర్చల తర్వాత బీజేపీ కానీ, జయసుధ కానీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. గతంలో జరిగిన చర్చల్లో జయసుధ పార్టీలో చేరికపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలిసిన జయసుధ త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు ఇటీవల ప్రచారం జరుగుతోంది.
బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డితో జయసుధ భేటీ కావడం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. ఆమె బిజెపిలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ జాతీయ నాయకత్వం నుంచి స్పష్టమైన హామీ లభిస్తే బీజేపీలో చేరి గ్రేటర్ హైదరాబాద్ నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆమె సంసిద్ధత వ్యక్తం చేశారని చెబుతున్నారు.
ఆమె 2014లో రాష్త్ర విభజన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం చెందడంతో రాజకీయాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. 2016లో టిడిపిలో, 2019లో వైసీపీలో చేరినా ఆయా పార్టీల నాయకులు ఆమె ఉనికిని పట్టించుకోక పోవడంతో కొంతకాలంగా మౌనంగా ఉంటూ వచ్చారు.