కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తిరిగి వయనాడ్ ఎంపీగా కొనసాగనున్నారు. ఎంపీగా ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని లోక్సభ సెక్రటేరియేట్ పునరుద్ధరించింది. అలాగే వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేసేందుకు కూడా సుప్రీంకోర్టు వీలు కల్పించింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా రాహుల్ సభ్యత్వాన్ని దిగువ సభ పునరుద్ధరించింది. ఈ మేరకు లోక్ సభ సెక్రటేరియట్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ‘మోదీ ఇంటిపేరు’ కేసులో రెండేళ్ల జైలుశిక్షను రాహుల్ గాంధీ సవాలు చేయడంతో ఆగస్టు 4, 2023న సుప్రీంకోర్టు స్టే విధించింది.
సుప్రీంకోర్ట్ ఆదేశాల నేపథ్యంలో రాహుల్పై అనర్హత ఆదేశాలను నిలుపుదల చేస్తున్నట్టు లోక్సభ సెక్రటేరియేట్ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆయన ఎంపీగా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ మేరకు రాహుల్ గాంధీకి పార్లమెంట్ సెక్రటేరియేట్ సమాచారం అందించింది.
కాగా.. ‘మోదీ ఇంటిపేరు కేసులో’ దోషిగా తేలిన రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మార్చి 23, 2023న గుజరాత్ కోర్ట్ తీర్పునిచ్చింది. ఆ మరుసటి రోజు మార్చి 24, 2023న రాహుల్పై అనర్హతవేటుపడింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని నిబంధనల ప్రకారం పార్లమెంట్ సెక్రటేరియట్ ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
ఎంపీగా రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం పునరుద్ధరణ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. నేతల నుంచి కార్యకర్తల వరకు తెగ సంబరపడుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆనందంతో తన సహచర నేతలకు స్వీట్లు పంచిపెట్టారు.