ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం సంచలనానికి తెరదీసింది. బ్రిటీష్ కాలం నాటి ఇండియన్ క్రిమినల్ చట్టాలైన ఐపీసీ, సీసీపీ, ఐఈఏ స్థానాల్లో కొత్త చట్టాలను ప్రవేశపెట్టేందుకు సిద్దమైంది. ఐపీసీ స్థానంలో ‘భారతీయ న్యాయ సంహిత’ కొత్త చట్టాన్ని తీసుకోరాబోతోంది.
ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలకమైన మూడు బిల్లులను శుక్రవారం లోక్సభలో ప్రవేశపెట్టారు. కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ స్థానంలో ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో ‘భారతీయ సాక్ష్య’ చట్టాలకు సంబంధించిన బిల్లులను సభలో ప్రవేశపెట్టారు.
1860 నుంచి 2023 వరకు దేశంలో న్యాయ వ్యవస్థ బ్రిటీషర్లు రూపొందించిన విధంగానే అమలు అయ్యిందని తెలిపారు. ఆ మూడు చట్టాలను మార్చేసి, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్లో పెను మార్పులు తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. అమిత్ షా ప్రవేశపెట్టిన మూడు బిల్లులను స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేశారు.
ఇక శాంతి భంగం కలిగించే నేరాలు, సాయుధ తిరుగుబాటులు, విధ్వంసకర చర్యలు, విజభనవాద కార్యకలాపాలు లేదా భారత ఐక్యత, సమగ్రతకు సంబంధించిన చట్టాలను సవరించిన చట్టాలలో చేర్చనున్నారు. మరోవైపు మహిళలు, పిల్లలు, హత్యలు, ప్రభుత్వ వ్యతిరేక నేరాలను కొత్త బిల్లుల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఇక తొలిసారిగా చిన్నచిన్న నేరాలకు సంఘసేవను శిక్ష విధించబోతున్నారు. అంతేకాదు లింగ సమానత్వంతో కొత్తచట్టాలను రూపొందించారు. ఇక వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలు, ఉగ్రవాదానికి సంబంధించిన కొత్త కార్యకలాపాలను నియంత్రించేలా కఠినమైన శిక్షలను చేర్చారు.
అంతేకాదు వేర్వేరు నేరాలకు సంబంధించిన జరిమానాలు, శిక్షలను పెంచారు. బ్రిటీష్ కాలం నాటి చట్టాలను ప్రక్షాళన చేసి కొత్తవాటిని ప్రవేశపెట్టడమే లక్ష్యమని ఈ సందర్భంగా లోక్సభలో అమిత్ షా తెలిపారు. కాగా ఇండియన్ పీనల్ కోడ్ను (ఐపీసీ) 1860లో ప్రవేశపెట్టారు.
మూడు బిల్లుల్లోని ముఖ్యమైన మార్పులు
- మైనర్లను అత్యాచారం చేస్తే ఉరిశిక్ష.
- సామూహిక అత్యాచారానికి పాల్పడితే 20 ఏళ్ల జైలు.
- మూక దాడులకు ఏడేళ్ల జైలు.
- 7 సంవత్సరాలకుపైగా శిక్ష విధించే కేసుల్లో ఫోరెన్సిక్ సాక్ష్యాలు తప్పనిసరి.
- ఎక్కడి నుంచైనా ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేయవచ్చు.
- సెర్చ్ ఆపరేషన్ చేస్తే సెర్చ్ వారెంట్తోపాటు ఎవరి వద్దకైనా వెళ్తే వీడియోగ్రఫీ చేయాల్సిందే.
- ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జిషీట్ వరకు అన్ని డిజిటైలైజ్ చేయాలి.