సీఎం కేసీఆర్ భూముల అమ్మకం.ఇళ్ళు కూల్చి పందిరి వేసినట్లు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ధనిక రాష్ట్రం అని చెప్పి పదేపదే బీఆర్ఎస్ నేతలు చెపుతుంటారని, భూముల అమ్మకం అంటే ప్రజలను మోసం చేయడమేనని ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మారుస్తున్నారని, ప్రభుత్వ సొమ్మును ఆగంట్లో అమ్మడం అనేది దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. సంపద సృటించాలి కానీ అమ్ముకుంటే పోతే వ్యవస్థలు కుప్ప కులుతాయని కేంద్ర మంత్రి హెచ్చరించారు. భూములు అమ్ముకుంటే పోతే వ్యస్థ పతనానికి నాంది అని పేర్కొంటూ సీఎం కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివింది దీనికోసమేనా? అని ప్రశ్నించారు.
భవిష్యత్తుకు, భావితరాలకు ఉపయోగపడాల్సిన భూములను అమ్మడం సరైన నిర్ణయం కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి కార్యాలయానికి 10 ఎకరాలు భూమిని ఇచ్చిందని, ప్రజలకు ఉపయోగ పడే సైన్స్ సిటీకి మాత్రం భూమి ఇవ్వమంటే ఇవ్వరని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు కుమ్మక్కయి అక్రమంగా భూములు పంచుకుంటున్నారని ఆరోపించారు.
అధికారంలో ఉన్న బీఆర్ఎస్కు 11 ఎకరాలు, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్కు 10 ఎకరాలు ఇచ్చారని, రెండు పార్టీలు కుమ్మక్కయి కలసి పని చేస్తున్నాయని విమర్శించారు. ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఏ పద్ధతిలో భూమి ఇచ్చామో అదే పద్దతిలో బీఆర్ఎస్కు ఇస్తున్నామని జీవో కూడా ఇచ్చారని విమర్శించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి భూములు అమ్మితే ప్రస్తుత మున్సిపాలిటీ మంత్రి కేటీఆర్ వ్యతిరేకించారని, అధికారంలోకి రాగానే మళ్ళీ భూములు అమ్ముతున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు.