వివాదాస్పద ‘సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం’ను ఈ ఏడాది చివర్లోగా సంపూర్ణంగా ఉపసంహరిస్తామని అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. ప్రస్తుతం అస్సాంలోని 8 జిల్లాల్లో మాత్రమే ఆ చట్టం అమల్లో ఉందని చెప్పారు.
77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జండా వందనం చేసిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మిగతా జిల్లాల్లో ఈ చట్టాన్ని ఉపసంహరించామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఈ చట్టాన్ని కొనసాగించాలని గత ప్రభుత్వాలు దాదాపు 62 సార్లు కేంద్రాన్ని కోరాయని తెలిపారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు చాలా మెరుగయ్యాయని హిమంత బిశ్వ శర్మ తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 8 వేల మంది జనజీవన స్రవంతిలోకి, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చొరవతో మొత్తం ఈశాన్య రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు సామరస్యంగా పరిష్కారం కాగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే తిరుగుబాటు దళాలతో తమ ప్రభుత్వం నాలుగు శాంతి ఒప్పందాలు చేసుకుందని వెల్లడించారు. అస్సాంని డ్రగ్స్ రహిత, అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం తన లక్ష్యమని చెప్పారు. రాష్ట్రంలో బహుభార్యత్వాన్ని తొలగించే దిశగా త్వరలో కఠిన చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తామని తెలిపారు.