సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో వాన్పిక్ భూములకు సంబంధించి సుప్రీం కోర్టు యథాతథ స్థితి (స్టేట్సకో) విధించింది. వాన్పిక్ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. శుక్రవారం వాన్పిక్ భూములకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
వాన్పిక్ ప్రాజెక్ట్కు అనుకూలంగా ఇచ్చిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, పంకజ్ మిట్టల్లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఇప్పటికే 15 ఏళ్లు వృధాగా గడచిపోయాయని, ఇందులో దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన అంశం ముడిపడి ఉందని వాన్పిక్ ప్రాజెక్ట్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
వాన్పిక్ అనేది రాష్ట్ర ప్రభుత్వం – రస్ అల్ ఖైమాతో సంయుక్తంగా ఏర్పాటు చేసిన స్పెషల్ పర్పస్ వెహికిల్ అని చెప్పుకొచ్చారు. విచారణలో జాప్యం కారణంగా ప్రాజెక్టు ముందుకు కదలడం లేదని వాదించారు. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఉంటే దానిపై విచారణ జరపవచ్చని.. కానీ మొత్తం ప్రాజెక్టు భూములను ఈడీ అటాచ్ చేయడం తగదంటూ ప్రాజెక్ట్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
వాన్పిక్ ఆస్తుల అటాచ్మెంట్ చెల్లదంటూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. వెంటనే 11,804.78 ఎకరాలను విడుదల చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. గత ఏడాది సెప్టెంబర్లో 1,416 ఎకరాల రిలీజ్కు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే 2014, 2017లో వాన్పిక్కు చెందిన 13,221 ఎకరాలను ఈడీ అటాచ్ చేసింది.
ఈడీ చర్యను పీఎంఎల్ఏ అప్పీలేట్ ట్రిబ్యునల్ సమర్థించింది. వాడరేవు – నిజాంపట్నం పోర్ట్స్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్స్ పేరుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో ఒకటైన రస్ అల్ ఖైమాతో ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేయాలనుకున్న ప్రాజెక్టు ఇది.