పంజాబ్ గవర్నర్ బన్వారిలాల్ పురోహిత్, సీఎం భగవంత్ మాన్ మధ్య లేఖల యుద్ధం తారస్థాయికి చేరింది. గవర్నర్ బన్వారిలాల్ శుక్రవారం సీఎంకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. గతంలో తాను రాసిన లేఖలకు సమాధానం ఇవ్వకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తానని, క్రిమినల్ చర్యలకు ఉపక్రమిస్తానంటూ హెచ్చరించారు.
ఈ మేరకు మాన్కు పంపిన లేఖను గవర్నర్ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు. గతంలో రాసిన లేఖలపై ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై కలత చెందినట్టు పేర్కొన్నారు. రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యంపై రాష్ట్రపతికి నివేదించగలనంటూ హెచ్చరించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 ప్రకారం తాను ‘తుది నిర్ణయం’ తీసుకోవడానికి ముందే చర్యలు తీసుకోవాలని మాన్కు సూచించారు. శిక్షణ నిమిత్తం 36 మంది పాఠశాలల ప్రిన్సిపాల్స్ను విదేశాలకు పంపడంతో పాటు పలు ఇతర అంశాలపై తాను గతంలో రాసిన లేఖ ద్వారా సమాచారం కోరానని గుర్తు చేశారు.
అదేవిధంగా రాష్ట్రంలో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగం సమస్యను నివారించేందుకు తీసుకొన్న చర్యలపై వివరాలు కోరానని గవర్నర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉద్దేశపూర్వకంగా సమాధానం నిరాకరిస్తున్నట్టు కనిపిస్తున్నదని పేర్కొన్నారు.
రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం గురించి ఆర్టికల్ 356 ప్రకారం భారత రాష్ట్రపతికి నివేదిక పంపించడం, ఐపీసీ సెక్షన్ 124 ప్రకారం క్రిమినల్ ప్రొసీడింగ్స్ ప్రారంభించడంపై తుది నిర్ణయం తీసుకోవడానికి ముందు తన లేఖల ద్వారా కోరిన సమాచారాన్ని పంపించాలని కోరుతున్నట్టు చెప్పారు.
అలాగే, రాష్ట్రంలో మాదకద్రవ్యాల సమస్యకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపైనా సమాచారం ఇవ్వాలన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే రాజ్యాంగం, చట్టపరంగా చర్యలు తీసుకోవడం తప్ప తనకు వేరే మార్గం ఉండదన్నారు..
పంజాబ్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు సిఫార్సు చేస్తానంటూ గవర్నర్ పురోహిత్ బెదిరింపులకు దిగడంపై అధికార ఆమ్ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. పంజాబ్కు బదులు మణిపూర్, హర్యానాలో రాష్ట్రపతి పాలన విధిస్తే బాగుంటుందని స్పష్టంచేసింది. రాజ్యాంగ పరిధిలోనే ఆప్ సర్కారు పనిచేస్తున్నదని ఆ పార్టీ అధికార ప్రతినిధి మల్విందర్ సింగ్ కాంగ్ పేర్కొన్నారు.