వేతన సవరణ అంశంపై గత నెలరోజులకు పైగా నిర్ణయం తీసుకోకుండా, ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్రెడ్డి దాటవేత ధోరణులు అవలంభించడం పట్ల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు వేతన సవరణ నివేదికను బహిరంగ పరచక పోవడం, ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి తప్పా ముఖ్యమంత్రి చర్చలకు పిలవక పోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పిఆర్సి అమలు, సిపిఎస్ రద్దు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, గ్రామ సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్తో పాటు మిగిలిన అన్ని సమస్యలపై ఇకపై సిఎం జగన్మోహన్రెడ్డితో మాత్రమే చర్చిస్తామని ఎపిజెఎసి, ఎపిజెఎసి అమరావతి జెఎసి చైర్మన్లు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటించారు.
ఈ నెల 9న అన్ని జిల్లాల నుంచి ఇరు జెఎసిల అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి జెఎసి నేతలతో విజయవాడలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాస్తున్నట్లు తెలిపారు. అదే రోజు సాయంత్రం సంయుక్త జెఎసిల పక్షాన ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని జెఎసి నేతలు ప్రకటించారు. ఉద్యోగుల సమస్యలపై రెండు జెఎసిల సంయుక్త రాష్ట్ర సెక్రటేరియట్ సమావేశం విజయవాడ గాంధీనగర్లోని ఎపి ఎన్జిఓ హోమ్లో సోమవారం జరిగింది.
అనంతరం జెఎసి నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ సిఎం వద్దకు వెళ్లకుండా ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, సిఎస్ సమీర్శర్మ, ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు.
జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో హామీనిచ్చిన అధికారులు తర్వాత జరిగే సమావేశాలకు రావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. తాము దాచుకున్న డబ్బులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు మార్చిలోపు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడం కుట్రగా భావిస్తున్నామని మండిపడ్డారు. 71 డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వం ముందు పెట్టామని పేర్కొన్నారు.
సిపిఎస్ రద్దుపై ప్రభుత్వం కనీసం ఒక్క మాట కూడా చెప్పడం లేదని విమర్శించారు. సిపిఎస్ ఉద్యోగుల వేల కోట్లు డబ్బులు ఎక్కడికి పోయాయో చెప్పడం లేదని వారు ఆరోపించారు. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని రెండు నెలలు గడిచినా ఎలాంటి చర్యలు లేవని ధ్వజమెత్తారు. సిఎస్ నివేదికలో చెప్పినవన్నీ తప్పులేనని, పిఆర్సి డిమాండ్ నెరవేరిస్తే ప్రభుత్వం వల్ల ఎలాంటి ఆర్థిక భారం పడదని వారు స్పష్టం చేశారు.