కీలకమైన మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభ బుధవారం ఆమోదం తెలిపింది. బిల్లుపై 60 ఎంపీలు మాట్లాడారు. బిల్లుపై దాదాపు 8 గంటల పాటు చర్చ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా రెండు ఓట్లు వచ్చాయి. కొత్త పార్లమెంట్లో ఆమోదం పొందిన తొలి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు నిలిచింది.
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో పాటు మరో ఎంపీ జలీల్ ఈ బిల్లును వ్యతిరేకించిన వారిలో ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు 2024 ఎన్నికల్లో అమలు కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. నియోజకవర్గాల పునర్విభజన, జనాభా లెక్కల అనంతరం 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలవుతుందని తెలిపారు.
2024 ఎన్నికలు పూర్తయిన తరువాత జనాభా లెక్కల ప్రక్రియ పూర్తవుతుందని, ఆ తరువాత డిలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుందని ఆయన తెలిపారు. ఇవి పూర్తయిన తరువాత 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలవుతుందని చెప్పారు.
మహిళలకు రిజర్వేషన్లు బీజేపీకి రాజకీయ సమస్య కాదంటూ ఇది గుర్తింపు సమస్య అని అని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని మహిళా సాధికారత కొన్ని పార్టీలకు రాజకీయ సమస్య కావచ్చని సెటైర్లు వేశారు. వారికి ఇది రాజకీయ ఎజెండా, ఎన్నికలలో గెలవడానికి జిమ్మిక్కు కావచ్చని అంటూ ధ్వజమెత్తారు. కానీ బీజేపీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఇది రాజకీయ సమస్య కాదని స్పష్టం చేశారు.
పార్లమెంటు ప్రత్యేక ఐదు రోజుల సమావేశాల మూడో రోజున లోక్సభలో ప్రసంగించిన హోంమంత్రి అమిత్ షా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కొత్త శకానికి నాంది పలుకుతుందని తెలిపారు ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి మహిళల భద్రత, గౌరవం, సమాన భాగస్వామ్యం ప్రభుత్వానికి జీవనాధారమని చెప్పారు. జి20లో మహిళల నేతృత్వంలోని ప్రగతి దార్శనికతను కూడా ఆయన అందించారని పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఈ బిల్లు అసంపూర్తిగా ఉందని, అందులో ఓబీసీ రిజర్వేషన్ గురించి ఎలాంటి చర్చ లేదని చెప్పారు. ఇందులో రెండు తప్పులు ఉన్నాయని అంటూ ముందుగా దాన్ని సరిచేయాలని కోరారు. లోక్సభ, రాజ్యసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ ఈ బిల్లును ఇక నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ రిజర్వేషన్ను కూడా చేర్చాలని చెబుతూ డీలిమిటేషన్, జనాభా లెక్కలు బిల్లు అమలుకు అవసరం లేదని స్పష్టం చేశారు. కుల గణన అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తిన వెంటనే బిజెపి అకస్మాత్తుగా ఇతర అంశాలను ముందుకు తెచ్చి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తోందని, దీంతో ఓబీసీ వర్గాలు, భారత ప్రజలు అటువైపు చూస్తున్నారని రాహుల్ విమర్శించారు.